వచ్చే సంక్రాంతి పండుగ లోపు ఏపీకి కొత్త ముఖ్యమంత్రి... చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు...
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే భోగి పండుగ లోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీ పోతుందున్న దిగులుతోనే జగన్ బయటకు రావట్లేదని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని... పేదలకు ఇచ్చే బియ్యాన్ని సైతం ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆ బియ్యంలో 50శాతం పక్కదారి పడుతోందని ఆరోపించారు. శనివారం(సెప్టెంబర్ 11) తిరుపతిలో చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ఆన్లైన్లో సినిమా టికెట్లు విక్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని చింతా మోహన్ తప్పు పట్టారు. ప్రభుత్వానికి సినిమా టికెట్లు విక్రయించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటు కేంద్రంలో,ఇటు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవసరముందని... అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని అన్నారు. దీపావళి పండుగ లోపు రాష్ట్ర కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి మార్పుపై చింతా మోహన్ జోస్యం చెప్పడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో కొత్త సీఎం రాబోతున్నారంటూ ఆయన జోస్యం చెప్పారు. నెల రోజుల క్రితం తిరుపతిలో మాట్లాడుతూ... మరికొన్ని వారాల్లో సీఎం మార్పు జరగబోతుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని... ఆయన మాజీ కాబోతున్నారని అన్నారు.బెయిల్ కేసు నుంచి బయటపడేందుకు ఉత్తరాది పారిశ్రామికవేత్త,కేంద్రమంత్రి కుమారుడి సాయాన్ని జగన్ కోరుతున్నారని ఆరోపించారు. అంతకుముందు,తిరుపతి ఉపఎన్నిక సందర్భంలోనూ చింతా మోహన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.ఆరు మాసాల తర్వాత సీఎం పదవిలో జగన్ ఉండరని కామెంట్ చేశారు.
ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ... కొద్ది నెలల క్రితం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత నెలలోనే తీర్పు వస్తుందని భావించినప్పటికీ.. కోర్టు సెప్టెంబర్ 15కి తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు అక్రమాస్తుల కేసుకు సంబంధించి మొదట ఈడీ కేసులను విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే మొదట సీబీఐ కేసులను విచారించాలని జగన్ తరుపు న్యాయవాదులు పట్టుబడుతున్నారు. ఈ కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేయగా... అక్కడా చుక్కెదురైంది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. సీబీఐ కేసుల్లో విచారణ పూర్తయిన తర్వాత, లేదంటే సీబీఐ కేసులతోపాటు కలిపి విచారించాలని నిందితులు మొదట సీబీఐ కోర్టును అభ్యర్థించగా... కోర్టు అందుకు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. ఒకవేళ సుప్రీం కోర్టు కూడా సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తే జగన్కు బిగ్ షాకిచ్చినట్లే అని చెప్పాలి. ఈడీ కేసుల్లో విచారణ ప్రక్రియ,శిక్షలు వేగవంతంగా అమలవుతాయి కాబట్టే.. దానికి బదులు మొదట సీబీఐ కేసులను విచారించాలని పట్టబడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.