అరేబియాలో వాయుగుండం: బెజవాడ జలదిగ్బంధం
హైదరాబాద్/విశాఖపట్నం: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, కడప తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా విజయవాడ జలదిగ్బంధంలో మునిగిపోయింది. గుంటూరు సహా పలు జిల్లాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. వాగు దాటుతూ ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు.
పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. పంట పొలాలు నీట మునిగాయి. రాయలసీమ ప్రాంతంలో కుండపోత కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వేధవతి, చంద్రవంక, నాగులేరు తదితర వాలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా చిత్తూరు జిల్లా ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుకుంటోంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతరమైంది. ఇది ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 1270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయు గుండం ఉథ్తర గుజరాత్ తీరం వైపు తరలి వెళ్లనుంది. వాయుగుండం నుండి కర్నాటక మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది.
నైరుతి బంగాళాఖాతం నుండి తెలంగాణ వరకు మరో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. వీటి వల్ల రానున్న ఇరవై నాలుగు గంటలలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల, తెలంగాణలోను కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశముంది. కాగా, వాయుగుండం ప్రభావం తెలంగాణ, ఏపీల పైన అంత ఉండదని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు మాత్రం కురుస్తాయని తెలిపింది.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మాచర్లలో అత్యధికంగా 29 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. పులిచింతల ముంపు గ్రామాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
నాగార్జునసాగర్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నందున పులిచింతలకు 7,900 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. పులిచింతల నుంచి దిగువకు 66 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ముంపు గ్రామాలైన నెమలిపురి, అడ్లూరు, వెల్లటూరు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.
గుంటూరు జిల్లాలోని పులిచింతల సహా కొల్లూరు, గోళ్లపేట, బోధనమనే గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. దీంతో కృష్ణా డెల్టా అధికారులు అప్రమత్తమయ్యారు. పులిచింతల ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండటంతో ఏడు గేట్లను ఎత్తి 65వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నల్గొండ జిల్లాలోను విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.