జగన్ కంటే భిన్నంగా, వేగంగా పవన్ కళ్యాణ్: పక్కా ప్లాన్తో అడుగులు
జనసేన అధినేత పవన కళ్యాణ్ రాజకీయాల్లో ఇక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లనున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వాలను ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే ప్రశ్నించారు. ఇక జనంలోకి రానున్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన కళ్యాణ్ రాజకీయాల్లో ఇక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లనున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వాలను ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే ప్రశ్నించారు. ఇక జనంలోకి రానున్నారు. సోషల్ మీడియా ద్వారానే ప్రశ్నిస్తారనే అపవాదును చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
భూమిని లీజుకు తీసుకున్న పవన్
త్వరలో ఏపీ రాజధాని అమరావతి సమీపంలోని చినకాకానిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జాతీయ రహదారి పక్కనే ఉన్న కొంత భూమిని లీజుకు తీసుకున్నారు. త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. లండన్ పర్యటన అనంతరం పవన్ పార్టీపై దృష్టి సారించారు. కార్యాలయం ఏర్పాటు అనంతరం అక్కడి నుంచే కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఆ సినిమా తర్వాత జనంలోకి
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం పవన్ బిజీగా ఉన్నారు. ఆ బిజీలో ఉంటూనే పార్టీపై దృష్టి సారిస్తున్నారు. ఆ సినిమాను జనవరిలో విడుదల చేయనున్నారు. ఆ సినిమా విడుదల అనంతరం నెల రోజుల పాటు పవన్ జనంలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. చేతిలోని సినిమాలు పూర్తి చేసి, పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకొనేసరికి దాదాపు ఎన్నికలు దగ్గరపడతాయి. ఆ సమయంలోపు కార్యాలయాన్ని నిర్మీంచాలని, జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.
ఆ ముద్రను కూడా చెరిపేసుకునే పనిలో పవన్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు ఓడల పైన కాళ్లు పెట్టారు. ఏదో ఒక రంగంలో ఉండాలని ఆయనకు సూచించిన వారు కూడా ఉన్నారు. అయితే అప్పటికే ఆయన పలు సినిమాలకు అంగీకరించారు. దీంతో ఆ సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత 2019 ఎన్నికలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. కుదిరితే సినిమా లేకుంటే రాజకీయం అనే ముద్రను చెరిపేసుకునేందుకు పవన్ ప్రయత్నిస్తారని అంటున్నారు.
ఇటీవలి వరకు ఏపీకి రాని జగన్
రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆయన, మంత్రులు అమరావతి నుంచే అంతా చూసుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ హైదరాబాదులో ఉండి ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. దీంతో అమరావతికి దగ్గరగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. కానీ పవన్ మాత్రం రంగంలోకి ఇంకా పూర్తిగా దిగకముందే ఏపీలో కార్యాలయాన్ని సిద్ధం చేసేందుకు ఉద్యుక్తులయ్యారు.
జగన్కు భిన్నంగా పవన్ కళ్యాణ్
టీడీపీ గుంటూరు నుంచి కార్యక్రమాలు చేపడుతోంది. వైసీపీ నిన్నటి వరకు హైదరాబాద్ నుంచి చేపట్టింది. ఇటీవలే విజయవాడలో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆ కార్యాలయం ప్రారంభించినప్పటికీ ఎక్కువ కార్యక్రమాలకు హైదరాబాదే వేదికగా మారింది. కానీ పవన్ అందుకు భిన్నంగా ఏపీలో కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఏపీ కార్యక్రమాలు కొనసాగేలా చూడాలనుకుంటున్నారు.
పకడ్బందీగా ముందుకు పవన్ కళ్యాణ్
ఏపీలో పూర్తిస్థాయి కార్యాలయం అనంతరం తెలంగాణ పైనా దృష్టి సారించనున్నారు. మొత్తానికి సినిమాల బిజీ నుంచి క్రమంగా దూరం జరుగుతున్న పవన్ వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.