కెసిఆర్ కొలువులోకి వీరే: తలసానికి చోటు, ఎమ్మెల్యేగా రాజీనామా
హైదరాబాద్: అందరి అంచనాలు కాస్తా తలకిందులు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రివర్గంలోకి కొత్త మంత్రులను ఆరుగురిని తీసుకుంటున్నారు. సీనియారిటీకీ, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పెద్ద పీట వేస్తూ ఆయన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆరుగురిని పేర్లను గవర్నర్ అధికారిక నివాసం రాజభవన్కు పంపించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలకు మంత్రి వర్గంలో ఆయన చోటు కల్పిస్తున్నారు. అదే విధంగా వరంగల్ జిల్లాకు చెందిన చందూలాల్ను కూడా ఆయన మంత్రివర్గంలో చేర్చుకుంటున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావుకు మంత్రి పదవి ఇవ్వనున్నారు. మంత్రి పదవిని హామీగా తీసుకునే తుమ్మల నాగేశ్వర రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరినట్లు మొదటి నుంచి ప్రచారం సాగుతోంది.
తుమ్మల నాగేశ్వర రావుతో పాటు చందూలాల్ శాసనమండలికి ఎన్నికయ్యే విధంగా చూస్తారని అంటున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి బిఎస్పీ నుంచి శాసనసభకు ఎన్నికై టిఆర్ఎస్లో చేరారు. ఎస్టీ కోటాలో చందూలాల్కు మంత్రి పదవి ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎస్టీలకు మంత్రివర్గంలో చోటు లేదు. మహబూబ్ నగర్ జిల్లాకు ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు లేదు. దీంతో ఆ జిల్లాకు చెందిన ఇద్దరికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. హైదరాబాదు నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్న జాబితాలో ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్లోకి వచ్చారు.
ఈసారి కూడా మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదు. కొండా సురేఖకు మంత్రి పదవి లభించడం లేదు. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అలిగిన కొప్పుల ఈశ్వర్ పేరు లేకుండా రాజభవన్కు జాబితా చేరింది. మొత్తం మీద, చాలా మందికి నిరాశను కలిగిస్తూ కెసిఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీనియారిటీ లోపం కొట్టొచ్చినట్లు కనిపించడంతో గతంలో మంత్రులుగా పనిచేసినవారికి కెసిఆర్ మలి జాబితాలో ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
కెసిఆర్తో పాటు ఇప్పుడు తెలంగాణ మంత్రి వర్గ సభ్యుల సంఖ్య 18కి చేరుకుంటుంది. నిబంధనల మేరకు అంతకు మించి మంత్రులను తీసుకునే అవకాశం లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్పై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అయితే, అనర్హత వేటు పడితే, తలసాని శ్రీనివాస యాదవ్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచేలా చూడాలని కెసిఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కొత్త మంత్రులు వీరే...
1.
ఇంద్రకరణ్
రెడ్డి
(ఆదిలాబాద్
జిల్లా)
2.
అజ్మీర
చందూలాల్
(వరంగల్
జిల్లా)
3.
జూపల్లి
కృష్ణారావు
(మహబూబ్నగర్
జిల్లా)
4.
లక్ష్మారెడ్డి
(మహబూబ్నగర్
జిల్లా)
5.
తలసాని
శ్రీనివాస
యాదవ్
(హైదరాబాద్)
6.
తుమ్మల
నాగేశ్వర
రావు
(ఖమ్మం
జిల్లా)
ఇదిలావుంటే, మంత్రి పదవి చేపట్టనున్న తలసాని శ్రీనివాస యాదవ్ శాసనసభ్యుడిగా రేపు రాజీనామా చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన టిఆర్ఎస్లో చేరారు. దీంతో శానససభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మంత్రి పదవిని చేపట్టే అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలని ఆయన అన్నారు. స్ఫీకర్కు రాజీనామా ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి రాజభవన్ వెళ్లే అవకాశాలున్నాయి. అన్ని వివరాలు రేపు (మంగళవారం) వెల్లడిస్తానని ఆయన చెప్పారు. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కాగా, వరంగల్ జిల్లాకు చెందిన వినయ్ భాస్కర్ను, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కోవా లక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. మరో ఇద్దరి పేర్లను రేపు ప్రకటిస్తారు. ఇదిలావుంటే, తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియమితులయ్యారు.