అన్నవరం దేవస్థానం కొత్త నిబంధన
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో కొత్త నిబంధనను తీసుకొచ్చారు. అన్నవరంలో వసతి గదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం లేకుండా అధికారులు నిబంధన పెట్టారు. వసతిగదిని తీసుకునే సమయంలో భక్తుడి ఆధార్ నెంబర్ను సిబ్బంది నమోదు చేస్తారు.
ఇలా ఒకసారి ఆధార్ నెంబర్పై గదిని పొందిన తర్వాత మళ్లీ 90 రోజుల వరకూ కేటాయింపునకు అవకాశం లేకుండా సాఫ్ట్వేర్ను రూపొందించారు. దీంతోపాటు భక్తులు గది తీసుకునే సమయంలో ఖాళీ చేసే సమయంలో వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది.

ఏయే వసతి సముదాయం వద్ద ఎన్ని గదులు ఉన్నాయి.. వాటిలో ఎన్ని బుక్ అయ్యాయి.. ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న వివరాలతో కొండ దిగువన సీఆర్వో కార్యాలయం వద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీంతో భక్తులకు స్పష్టమైన సమాచారం అందనుంది. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఈ విధానం అమలులోకి తీసుకొచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇది ఇలావుండగా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్మ ప్రచార మాసోత్సవాలను కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు రాజగోపురం వద్ద సహస్ర దీపాలంకరణ మందిరంలో సత్యనారాయణ వ్రతం చేశారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, ఆలయ ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈవో ఆజాద్లు.. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం ధర్మ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సభలో పండితులను సత్కరించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాన దేవాలయాల్లో ఒక్కో చోట నెల రోజులపాటు ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. విజయవాడ దుర్గ గుడి, శ్రీశైలం దేవస్థానాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సెప్టెంబర్ 7న ప్రారంభించనున్నట్లు మంత్రి కొట్టు వెల్లడించారు.












Click it and Unblock the Notifications