రాజధానిగా అమరావతిపై ఏపీ కాంగ్రెస్ తాజా నిర్ణయం ఇదే..!!
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం ఎటూ తెగట్లేదు. మూడున్నర సంవత్సరాలుగా రోజూ హెడ్ లైన్స్లో ఉంటో వస్తోందీ అంశం. న్యాయపరమైన ఇబ్బందులనూ ఎదుర్కొంటోంది. సుదీర్ఘకాలం పాటు న్యాయస్థానాల్లో నలుగుతోంది. సుప్రీంకోర్టులో సైతం మూడు రాజధానుల అంశం విచారణ జరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా.. మిగిలినవన్నీ మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్నాయి.
చంద్రుడి ఉపరితలం ఇలా ఉంటుంది - అత్యంత సమీపం నుంచి తీసిన ఫొటోలు
ఆందోళనలతో..
రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు మొదటి నుంచీ డిమాండ్ చేస్తోన్నారు. నిరసన దీక్షలను కొనసాగిస్తోన్నారు. మహా పాదయాత్రలకూ శ్రీకారం చుట్టారు. ఇదివరకు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి ప్రాంతం నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లారక్కడి రైతులు. మలిదశ ఆందోళనల్లో భాగంగా మరోసారి పాదయాత్రకు దిగారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం దీనికి బ్రేక్ పడింది.
కొత్త కార్యవర్గం..
అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన గిడుగు రుద్రరాజు నియమితులు అయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పీ రాకేష్ రెడ్డి అపాయింట్ అయ్యారు. కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్గా కేంద్ర మాజీమంత్రి ఎం ఎం పల్లంరాజు నియమితులు అయ్యారు.
హర్ష కుమార్ వ్యతిరేకం..
ప్రచార కమిటీ ఛైర్మన్గా లోక్సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్, మీడియా అండ్ సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్గా ఎన్ తులసీ రెడ్డి నియమితులు అయ్యారు. తనకు అప్పగించిన ప్రచార కమిటీ పగ్గాలను జీవీ హర్షకుమార్ వ్యతిరేకిస్తోన్నారు. తాను ఓ సాధారణ కార్యకర్తగానే ఉంటానని, ఎలాంటి పదవులను ఆశించట్లేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ప్రచార కమిటీ తన స్థాయికి తగదనే కారణంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
విశాఖలో సన్మానం..
కాగా- పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన గిడుగు రుద్రరాజుకు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. జగదాంబ జంక్షన్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగాలని అన్నారు. ఇది తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తాము శిరసా వహిస్తామని వ్యాఖ్యానించారు.
రైతుల ప్రయోజనాలకు కట్టుబడి..
అమరావతి ప్రాంత రైతుల ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే తాము అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రుద్రరాజు పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్టీలో చేరికలకు ప్రాధాన్యత ఇస్తోన్నట్లు చెప్పారు. ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని తేల్చి చెప్పారు.
భారత్ జోడో యాత్రతో..
వైఎస్ఆర్సీపీ, భారతీయ జనతా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే వారు, భావసారూప్యం గల నాయకులను కలుపుకొని వెళ్తామని గిడురు రుద్రరాజు అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని వ్యాఖ్యానించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఈ యాత్ర సానుకూల ప్రభావం ఖచ్చితంగా పడుతుందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం దీనిపైనే ఉంటుందని అన్నారాయన.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్యాయం..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని మోదీ ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటీకరిస్తోందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని, సమాజంలోని అన్ని వర్గాలతో కలిసి ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు కూడా నాటకాలు ఆడుతోన్నాయని ఆరోపించారు. బీజేపీ అధిష్ఠానంతో వైసీపీ లోపాయకారి ఒప్పందాలను కుదుర్చుకుందని మండిపడ్డారు.