మావోయిస్టుల సరికొత్త వ్యూహం.. గడ్డిబొమ్మలు, చెక్క తుపాకీలతో.. కూంబింగ్ పోలీసులపై కొత్త స్కెచ్
మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా మావోయిస్టులు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారని పోలీసులకు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దులలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగి అడుగడుగునా అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నాయి.
ఆంధ్ర, ఛత్తీస్ గడ్ బోర్డర్ లోనూ మావోయిస్టుల సరికొత్త వ్యూహాన్ని గుర్తించిన జవాన్లు
మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు చత్తీస్ గడ్ , మహారాష్ట్ర, తెలంగాణ మూడు రాష్ట్రాల సరిహద్దు దండకారణ్యానికి వచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో అడుగడుగునా గాలింపు చేపట్టిన భద్రతా బలగాలు డ్రోన్ల సహాయంతో గోదావరి పరివాహక ప్రాంతంలో గాలిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఆంధ్ర, ఛత్తీస్ గడ్ బోర్డర్ లోనూ మావోయిస్టుల సరికొత్త వ్యూహాన్ని గుర్తించారు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు.
పోలీసులను తప్పుదోవ పట్టించే మాస్టర్ ప్లాన్.. వరిగడ్డి బొమ్మలు, చెక్కతుపాకులు
మావోయిస్టుల కోసం జరుగుతున్న గాలింపు చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వస్తున్న పోలీసులను తప్పుదోవ పట్టించడానికి మావోయిస్టు మాస్టర్ ప్లాన్ వేసినట్లు గా గుర్తించారు. అటవీ ప్రాంతాలలో వరి గడ్డితో బొమ్మలు చేసి, వాటికి మావోయిస్టులలా బట్టలు వేసి, ఆపై వాటి చేతిలో చెక్క తుపాకులను పెట్టి పోలీసులకు అక్కడ మావోయిస్టులు ఉన్నట్లుగా భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల దృష్టి వాటిపై పడేలా డైవర్ట్ చేస్తున్నారు.
మావోల డమ్మీ బొమ్మల ప్లాన్ వెనుక వ్యూహం ఇదే
ఆ బొమ్మలను మావోయిస్టులుగా భావించి, చూసిన వెంటనే పోలీసులు సదరు బొమ్మల వైపు కూంబింగ్ పోలీసులు ఫైరింగ్ మొదలుపెడతారు. ఇక ఇదే సమయంలో అదనుచూసి పోలీసులను దెబ్బకొట్టాలని, వీలైతే వచ్చింది ఎంతమంది అనేది గమనించి వారిపై మెరుపుదాడి దిగాలని భావిస్తున్నారు. పోలీసులు బొమ్మలకు గురి పెడితే వారు పోలీసులకు గురి పెట్టాలని భావిస్తున్నారు. లేదంటే పోలీసులు చేసే ఫైరింగ్ తో అప్రమత్తమై అక్కడి నుండి వెళ్లిపోవాలని మావోయిస్టులు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.
దంతేవాడ జిల్లాలో అటవీ ప్రాంతంలో డమ్మీ బొమ్మలు గుర్తించిన జవాన్లు.. వాటి తొలగింపు
దంతేవాడ జిల్లా పల్లి బార్సూర్ అటవీ ప్రాంతంలో ఇదే తరహాలో వరి గడ్డితో బొమ్మలు తయారు చేసి, వాటికి బట్టలు వేసి ఆ బొమ్మల చేతిలో బొమ్మ తుపాకీలను పెట్టారు. ఇక ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న 195 బెటాలియన్ల జవాన్లు ఈ వ్యూహాన్ని పసిగట్టి మావోయిస్ట్ లు ఏర్పాటుచేసిన ఈ తరహా బొమ్మలను తొలగించినట్టు సమాచారం. మొత్తానికి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీసులు తప్పుదారి పట్టించడానికి మావోయిస్టులు ప్లాన్ చేసిన వ్యూహాన్ని భగ్నం చేశారు 195 బెటాలియన్ జవాన్లు .