వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు .. 30వ రోజు సీబీఐ విచారణలో ఆ ఐదుగురు !!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక మందిని విచారించిన సిబిఐ అధికారులు ఈ కేసుపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
వారి చుట్టూనే తిరుగుతున్న కేసు.. దూకుడు పెంచిన సీబీఐ
వైయస్ వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని, వివేక కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను విచారణ చేసిన సీబీఐ అధికారులు ఈ కేసు ప్రధానంగా ఐదుగురు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఆ ఐదుగురిని అనేక కోణాల్లో విచారిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో దూకుడు పెంచిన సిబిఐ అధికారులు తాజాగా ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ ప్రసాద్, మాజీ డ్రైవర్ దస్తగిరితో పాటు, వివేకానంద రెడ్డికి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక వీరి స్టేట్మెంట్లను రికార్డ్ చేసి నలుగురిని కడప కు తరలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురికి నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించిన అధికారులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజాగా ఐదుగురిని విచారణ చేస్తున్న సీబీఐ
గతంలో ఈ కేసులో ప్రధానంగా భావించిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. అప్పుడు సిట్ అధికారులు ఈ కేసులో వివేకానంద రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి ,ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి, ఇంట్లో పనిమనిషి లక్ష్మి కుమారుడైన ప్రకాష్ లను అరెస్ట్ చేశారు. వివేకా హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారంటూ సిట్ అరెస్టు చేసిన ఎర్ర గంగిరెడ్డి తో పాటుగా వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ని, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను, డ్రైవర్ ప్రసాద్ ను, వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ ను ఇప్పుడు సీబీఐ అధికారులు మరోమారు ప్రశ్నిస్తున్నారు.
గత ౩౦ రోజులుగా సీబీఐ విచారణ
ఇక గత 30 రోజులుగా కొనసాగుతున్న సిబిఐ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఐదుగురిని పులివెందుల అతిథిగృహంలో విచారించిన అధికారులు ఈరోజు మరోసారి విచారణకు పిలిచారు. కడప కేంద్ర కారాగారం లోని అతిథి గృహానికి వచ్చిన ఈ ఐదుగురిని సిబిఐ అధికారులు మళ్లీ ప్రశ్నిస్తున్నారు. 2019 మార్చి 15వ తేదీన వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు సిబిఐ అధికారులు.
Recommended Video
సీబీఐ అధికారులకు సవాల్ గా వివేకా హత్యకేసు.. రాష్ట్రంలోనూ ఈ కేసుపై ఉత్కంఠ
హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేయడంతో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అనుమానం ఉన్న వారిపై కూడా విచారణ జరుపుతున్నారు. వివేకా హత్య కేసును సవాల్ గా తీసుకుని సిబిఐ అధికారులు త్వరితగతిన ఈ కేసును తేల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నా ఈ కేసును ఎప్పుడు తేలుస్తారు. వివేకాను హతమార్చింది ఎవరు ? దేని కోసం ? ఇది రాజకీయ హత్యనా ? లేక ఏదైనా వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యనా? అన్న ప్రశ్నలు ఇప్పటికీ తేలకుండా ప్రశ్నలుగానే ఉన్నాయి.