కాపు రిజర్వేషన్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్! అసలు నివేదికే సమర్పించలేదన్న జస్టిస్ మంజునాథన్
కాపు రిజర్వేషన్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తానసలు తన నివేదికనే సమర్పించలేదని రిజర్వేషన్లపై ఏర్పాటైన ఏపీ బీసీ కమిషన్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథన్ వెల్లడించారు.
అమరావతి: కాపు రిజర్వేషన్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తానసలు తన నివేదికనే సమర్పించలేదని రిజర్వేషన్లపై ఏర్పాటైన ఏపీ బీసీ కమిషన్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథన్ వెల్లడించారు.
శనివారం రాత్రి జస్టిస్ మంజునాథన్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఏపీ కేబినెట్ ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్ కు తమ కమిషన్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కమిషన్ నివేదికను ఒకట్రెండు రోజుల్లో అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాను ఇచ్చే నివేదికే కమిషన్ నివేదిక అవుతుందన్నారు. ఏపీలోని అన్ని వర్గాల వారికి తమ నివేదిక ఆమోదయోగ్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. రేపట్నించి సీఎం చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతుండడంతో తాను ఆయన్ని కలవలేదని జస్టిస్ మంజునాథన్ తెలిపారు.
తమ నివేదికను ప్రధాన కార్యదర్శి లేదా బీసీ సంక్షేమ కార్యదర్శికి అందజేస్తామని తెలిపారు. కమిషన్ నివేదిక అందజేయడానికి కార్యదర్శి కృష్ణమోహన్ వెళతారని చెప్పారు. కమిషన్లోని మిగిలిన ముగ్గురు సభ్యులు వ్యక్తిగతంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయమై ప్రశ్నించగా... ఆ విషయం తనను అడగవద్దని, ఇచ్చిన వాళ్లనే అడగాలని మంజునాథన్ వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకూ బీసీ కమిషన్ తరపున ఏపీ ప్రభుత్వానికి తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. బీసీ కమిషన్ నిబంధనల ప్రకారం నివేదిక పూర్తైన తర్వాత సభ్యులందరూ కలిసి నివేదికపై తీర్మానం చేసిన తర్వాతనే ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందన్నారు.
కమిషన్ సభ్యులందరి సంతకాలు లేకుంటే చట్టపరంగా అది బీసీ కమిషన్ నివేదిక అవదన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేశానని, బీసీ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందచేస్తామన్నారు.
మరోవైపు ఇప్పటికే కాపు రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీల జాబితాలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ సర్కారు సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది.