ఏపీ సీఎం జగనేనట, ముహూర్తం, సమయం కూడా ఫిక్స్ : సోషల్ మీడియాలో జ్యోతిష్య లేఖ
హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ శాతం పెరిగినందున ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఒకడుగు ముందేసిన వైసీపీ తమ పార్టే అధికారం చేపడుతోందని ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. తేదీ, సమయం, తిథి, వారం నిర్ణయించుకోన్నట్టు అందులో ఉండటంతో .. అది నిజమో కాదో తెలియదు కానీ ... వైసీపీ ధీమా ఏంటనే చర్చకు దారితీసింది.
ముహూర్తం కుదిరింది
వచ్చేనెల 23న దేశవ్యాప్తంగా లోక్సభ ఫలితాలతోపాటు ఏపీ .. మిగతా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్లను ఎన్నికల సంఘం చేపడుతోంది. తర్వాత 4 రోజులకు వైసీపీ తమ ముహూర్తం పెట్టుకుంది. మే 26 ఆదివారం వైశాఖ బహుళ సప్తమి రోజున ఉదయం 9.29 నిమిషాలకు వైసీపీ అధినేత జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందులో రాసి ఉంది. ఈ జ్యోతిష్యం పేరుతో ముహుర్తం రావడం, సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారం చేపడుతోందని వైసీపీ ధీమాకు గల కారణమెంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
జగన్, పార్టీ రాశులు కూడా ..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టడమే కాదు .. జగన్, వైసీపీ రాశుల ఆధారంగా కూడా ఆ పార్టీ విక్టరీ సాధిస్తోందని లెక్కపత్రాలతో రాశారు. జగన్ నక్షత్రం ఆరుద్ర అని .. దీంతో ఆయనకు ఈసారి కలిసి వస్తోందని జ్యోతిష్య నిపుణులు రాసినట్టు కనిపిస్తోంది. జగన్ తర్వాత ఆయన పార్టీ వైసీపీ కూడా శ్రీ కాలచక్ర నక్షత్రమని .. అంతా మంచే జరుగుతుందని జోస్యం చెప్పినట్టు కనిపిస్తోంది.
కోయిల ముందే కూసిందా ?
మరో 23 రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉండగా వైసీపీ అధికారం చేపడుతుందని జ్యోతిష్యం పేరుతో విడుదలైన లేఖపై నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు. ఏపీ కౌన్ జీతేగా .. కౌన్ బనేగా సీఎం అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ ఏపీలో అధికారం చేపట్టే పార్టీ, సీఎం పీఠం అధిష్టించబోయేది ఎవరో తెలుసుకోవాలంటే మరో కొద్దిరోజులు ఆగాల్సిందే.