విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఎన్జీటీ విచారణ కమిటీ .. తమ పోరాట ఫలితమేనంటున్న టీడీపీ
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా టిడిపి నేతలు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల పై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇక తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చెయ్యటంతో పరిశీలించిన జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై రగడ .. ఎన్జీటీలో టీడీపీ నేతల ఫిర్యాదు
టీడీపీ నేతలు విశాఖ మన్యంలో వైసిపి కనుసన్నల్లో మైనింగ్ మాఫియా నడుస్తోందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. లేటరైట్ ముసుగులో గిరిజనుల బతుకులను ఛిద్రం చేస్తూ వైసీపీ నేతలు బాక్సైట్ దందా సాగిస్తున్నారని ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మైనింగ్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వంపై పోరుబాట పట్టిన టిడిపి నేతలు ఈ వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేశారు.
పిటిషన్ పై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం.. కమిటీ ఏర్పాటు
అటవీశాఖ అనుమతులు లేకుండా వేలాది వృక్షాలను కొడుతున్నారని రోడ్ల నిర్మాణం చేపట్టారని, దీనిపై దృష్టి సారించాలని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కొండ్లు మరీదయ్య పేరుతో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం ఈమేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ మన్యంలో మైనింగ్ పేరుతో అక్రమాలు జరిగాయని ఎన్జీటీ నిర్ధారణకు వచ్చింది. వేల సంఖ్యలో చెట్లను కూల్చి రోడ్లు వేయడాన్ని తీవ్రంగా పరిగణించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.
కమిటీ అక్రమ మైనింగ్ పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం
అనుమతించిన పరిధి దాటి తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లాలలో అక్రమ మైనింగ్ చేశారని గుర్తించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని ఆదేశించింది. ఇక ఈ కమిటీలో కేంద్ర అటవీ శాఖ ,రాష్ట్ర గనుల శాఖ, పిసిబి అధికారులు, విశాఖ కలెక్టర్ సభ్యులుగా ఉండనున్నారు. అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతంలో పర్యటించి మైనింగ్ అనుమతులు, అసలు మైనింగ్ జరగాల్సిన పరిధి, రోడ్డు నిర్మాణం, అక్రమ మైనింగ్ పై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది.
విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్ జరగలేదన్న గనుల శాఖా మంత్రి
ఏపీ ప్రభుత్వం మాత్రం విశాఖ మన్యంలో ఎలాంటి అక్రమ మైనింగ్ జరగడంలేదని ఇప్పటికే వెల్లడించింది. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు జరగటం లేదని ఇటీవల గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు లేటరైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో లేటరైట్ లీజుకు ఇచ్చారని పేర్కొన్న గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పుడు తవ్వితే లేటరైట్ ఇప్పుడు తవ్వితే బాక్సైట్ వస్తాయా అంటూ టీడీపీని టార్గెట్ చేసి విమర్శించారు.
ఎన్జీటీ కమిటీ ఏర్పాటు పట్ల టీడీపీ హర్షం .. తమ పోరాట ఫలితమే అంటున్న టీడీపీ
ఏది ఏమైనా గత కొంతకాలంగా విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై పెద్దఎత్తున పోరాటం చేస్తున్న టిడిపి నేతలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. తాము చేసిన పోరాటాల ఫలితంగా ఎన్జీటీ విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా టిడిపి నేతలు భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఎన్జిటి ఏర్పాటుచేసిన కమిటీ విచారణ నేపథ్యంలో విశాఖ మన్యంలో మైనింగ్ నిర్వహిస్తున్న వారి వెన్నులో మాత్రం వణుకు పుడుతోంది.