ఏపీ సీఎస్, డీజీపీకి ఢిల్లీ నుంచి ఆదేశాలు..!!
Tirupati: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సమయంలో సంభవించిన ఘర్షణపై జాతీయ మానవ కమిషన్ తీవ్రంగా స్పందించింది. దీనిపై నివేదిక కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించింది.
తిరుపతిలో రణరంగం..
డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు ఈ నెల 3వ తేదీన బస్సులో కార్పొరేషన్కు వెళ్తోండగా, ఇద్దరు రౌడీషీటర్ల ఆధ్వర్యంలో టీడీపీ కూటమి నాయకులు బస్సును ఆపి, దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

పట్టపగలు.. నడిరోడ్డుపై
బస్సు కిటికీల అద్దాలను పగులగొట్టారని, ముందుకు కదలకుండా టైర్లలోని గాలి తీసివేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి విమర్శించారు. డ్రైవర్పై చేయి చేసుకున్నారని, పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తోండగా, పోలీసుల సమక్షంలో పట్టపగలు ఈ దాడి జరిగిందంటూ ఆరోపించారు.
బలం లేకపోయినప్పటికీ..
తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు. దీనికి అనుగుణంగా బలం లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన మునికృష్ణ డిప్యూటీ మేయర్ ఎన్నికలో విజయం సాధించారని మండిపడ్డారు.
ప్రధాన నిందితుల పేర్లు లేకుండా..
ఈ దాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రధాన నిందితుల పేర్లతో తిరుపతి సహా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఫిర్యాదు మేరకు శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రధాన నిందితుల పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ రాశారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది.
ఎన్హెచ్ఆర్సీ దృష్టికి..
దీనిపై ఈ నెల 14వ తేదీన తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి కార్పొరేషన్కు వెళ్లేలా ఎస్కార్ట్ కల్పించాలని అంతకు ముందే రాష్ట్ర హైకోర్టు ఆదేశించినప్పటికీ- పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు.
యాక్షన్ టేకెన్ రిపోర్ట్..
వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంపై నాలుగు వారాల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను సమర్పించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.












Click it and Unblock the Notifications