అంబటి, జోగి ఇళ్లలో దాడులపై మరో టర్న్..! ఢిల్లీకి చేరిన పంచాయితీ..!
ఏపీలో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ ఆరోపణలపై సిట్ రిపోర్ట్ ఇచ్చాక చంద్రబాబుపై విమర్శలకు దిగిన వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు దిగారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు వారికి స్టేషన్ బెయిల్స్ కూడా ఇచ్చి పంపేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC)లో ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొంటూ వైసీపీ (YSRCP)ప్రతినిధుల బృందం ఇవాళ ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ జస్టిస్ సుబ్రమణియాన్నికలిసి ఫిర్యాదు చేశారు. ఇందులో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను, అలాగే దళిత కార్యకర్త సాల్మన్ హత్యను, ఇతర దాడులపై ఆధారాలతో సహా వివరాలు అందజేశారు.

ప్రతిపక్ష నాయకులను భౌతికంగా నిర్మూలించడానికి ప్రయత్నాలు జరిగినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు అరాచక పాలనపై చర్యలు తీసుకోవాలని వారు హెచ్చార్సీని కోరారు. ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ సానుకూలంగా స్పందించారని, డీజీపీ నుండి నివేదిక కోరుతామని, నిజ నిర్ధారణ బృందం రాష్ట్రాన్ని సందర్శించే అవకాశం ఉందని అనంతరం వారు వెల్లడించారు.
దాడులపై సమగ్ర దర్యాప్తు కోరామని, NHRC దర్యాప్తు బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్ను సందర్శిస్తుందని సమావేశం తర్వాత వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ తెలిపారు.












Click it and Unblock the Notifications