ఏపీలో ఉగ్ర కలకలం.. ధర్మవరంలో ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మవరంలో ఉగ్ర కదలికలు ఒక్కసారిగా అందరినీ షాక్ గురిచేశాయి. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో కోట కాలనీకి చెందిన నూర్ అనే అనుమానిత వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం పైన చర్చ జరుగుతుంది.
ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న యువకుడు అరెస్ట్.. 16 సిమ్ లు స్వాధీనం
ధర్మవరం లోని ఒక హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే నూర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అతని వద్ద 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సిమ్ కార్డుల ద్వారా అతను ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడు అన్న దానిపైన ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు.

పాకిస్థాన్కు ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో ఛాటింగ్.. నూర్ అరెస్ట్
నూర్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు అతనిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు గా సమాచారం. గత కొంతకాలంగా నూర్ కదలికల పైన నిఘా పెట్టిన ఎన్ఐఏ పక్కా సమాచారంతోనే అతనిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నూర్ పాకిస్థాన్కు ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో ఛాటింగ్ చేస్తున్నట్లు సమాచారం. నూర్ మహమ్మద్ను అదుపులోకి తీసుకొని ఐబీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ జిల్లాలలో ఉగ్రవాదుల కలకలం
కాగా ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతి పరుడు అయిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ తో పాటు హైదరాబాద్లోని అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేసి ఉగ్ర కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అన్నమయ్య జిల్లా రాయచోటిలో కూడా ఉగ్ర కదలికల పైన పోలీసులు నిఘా పెట్టి రాయచోటి కొత్తపల్లిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీ లను ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు.
ఉగ్ర కదలికలపై పవన్ ఆదేశం
ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ పైన ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత, ఏపీలో ఉగ్ర కదలికల పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. సి ఎస్, డిజిపి కి పవన్ లేఖలు రాసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉగ్ర కదలికల పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నూర్ ను పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications