సోమవారం డ్యూటీలోకి నిమ్మగడ్డ- తొలి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి...
ఏపీ హైకోర్టు, గవర్నర్ ఆదేశాల మేరకు తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియామకమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడలో బందరు రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిమ్మగడ్డ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా ఆధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో విధులు నిర్వర్తించిన ఛాంబర్ లోనే నిమ్మగడ్డ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు ఆయన బాధ్యతలు తీసుకుంటారని అధికారులు తెలిపారు.
సోమవారం లాంఛనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా గతంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత నిమ్మగడ్డ రాష్ట్రంలో పలువురు ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

స్ధానిక ఎన్నికల వాయిదాకూ, ఈ బదిలీలకు సంబంధం లేదని వాదించిన జగన్ సర్కార్ వాటిని పక్కనబెట్టింది. ఆ తర్వాత నిమ్మగడ్డ స్వయంగా సీఎస్ నీలం సాహ్నీకి లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు బాధ్యతలు తీసుకోగానే తాను గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తారా లేక మరో ఆదేశం ఇస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతానికి ఎలాగో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేకపోవడంతో అప్పటి వరకూ చేపట్టాల్సిన చర్యలపై మాత్రం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో నిమ్మగడ్డ స్ధానంలో బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనగరాజ్ ఓసారి అధికారులతో ఇదే విషయంపై సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications