చంద్రబాబుకు ఎస్ఈసి వరుస షాకులు ... ఏపీలో ఇప్పుడు నిమ్మగడ్డ వర్సెస్ టీడీపీ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు మొదట్నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ టిడిపి నేతలకు వరుస షాకులు ఇస్తున్నారు.

ఎన్నికల్లో ఎస్ఈసి తమ ఫిర్యాదులను పట్టించుకోవటం లేదని టీడీపీ నేతల మండిపాటు
మొన్నటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదని టిడిపి నేతలు లబోదిబోమన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా టిడిపి నేతల ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పట్టించుకోవడంలేదని టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి నేతలపై మాత్రం తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, వైసీపీ నేతల బెదిరింపులకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి ఆధారాలు చూపినప్పటికీ ఎన్నికల కమిషన్ స్పందించలేదు అనేది టిడిపి నేతల వాదన.

చంద్రబాబు చిత్తూరు పర్యటనకు అనుమతి తీసుకోలేదన్న నిమ్మగడ్డ
ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు చిత్తూరు పర్యటన రచ్చగా మారిన విషయం తెలిసిందే. 9 గంటల పాటు రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబును నిర్బంధించడం తో హైడ్రామా కొనసాగింది. అయితే ఈ విషయంలో కూడా చంద్రబాబు చేసింది తప్పు అని వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అందుకు తగ్గట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా చంద్రబాబు పర్యటనకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు.

విశాఖ రాజకీయ పార్టీల నేతలతో భేటీ నుండి వర్లను బయటకు పంపిన ఎస్ఈసి
విశాఖలో ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఇదే సమావేశంలో అడుగడుగునా అడ్డు తగులుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య పలుమార్లు హెచ్చరించడమే కాకుండా, చివరకు వర్ల రామయ్య ను సమావేశం నుంచి బయటకు పంపించేశారు. నిబంధనల విషయంలో ఎలాంటి వివక్ష లేదని, ఎన్నికల కోడ్ అమలులో ఏ పార్టీ వారైనా సమానమేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు , టీడీపీ నేతలకు నిమ్మగడ్డ వరుస షాకులు
దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు, టిడిపి నేతలకు షాక్ అనే చెప్పాలి. ఓ పక్క అధికార పార్టీ, రమేష్ కుమార్ ను టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే ఎన్నికల కమిషనర్ గా భావిస్తుంటే, ఎన్నికల కమిషనర్ మాత్రం టిడిపి నేతలకు వరుస షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో టిడిపి ఫిర్యాదులపై నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications