కుటుంబంతో కలిసి నిమ్మల రామానాయుడు సత్యాగ్రహదీక్ష; ఆ హామీ గుర్తుచేసి జగన్ పై నిమ్మల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. వాటిని లబ్ధిదారులకు అందించకుండానే అధికారాన్ని పోగొట్టుకుంది. ఇక ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను కూడా ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఆందోళన సాగిస్తుంది. లబ్ధిదారులు ఇంటి విస్తీర్ణాన్ని బట్టి 25 వేల నుండి లక్ష రూపాయల వరకు చెల్లించాల్సి ఉన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి కావాలని జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంపై టిడిపి నాయకులు ఆందోళన చేస్తున్నారు.

ఫ్యామిలీతో కలిసి సత్యాగ్రహ దీక్షకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అందరికీ సొంత ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తన కుటుంబంతో కలిసి నిమ్మల రామానాయుడు దీక్షకు దిగారు. నిరుపేద లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను ఇవ్వాలని దీక్ష చేస్తున్న నిమ్మల రామానాయుడు కుటుంబానికి, టిడిపి నేతలు, స్థానికులు పలువురు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో కూర్చున్న నిమ్మల రామానాయుడు ఇప్పుడు వరకు లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని జగన్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పాదయాత్ర సమయంలో ఉచితంగా టిడ్కో ఇళ్ళ హామీ ఇచ్చిన జగన్ మాట మార్చారు
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆయన పాదయాత్ర చేసిన సమయంలో టిడ్కో ఇల్లు అందరికీ పూర్తిగా ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు నిమ్మల రామానాయుడు. జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని మండిపడ్డారు. ప్రతిపక్షాల మీద పగ తీర్చుకోవడం కోసం జగన్ ఆసక్తి చూపిస్తున్నారని, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇవ్వాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులలో రుణాలు తీసుకోమని లబ్ధిదారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపణలు గుప్పించారు.

ఎలాంటి రుణభారం లేకుండా టిడ్కో గృహాలు ఇవ్వాలని నిమ్మల డిమాండ్
వైయస్ జగన్ పాలనలో ఉన్న ఇల్లు లేదు, బిల్లు లేదు, ఆఖరికి కట్టిన ఇల్లు కూడా ఇవ్వడం లేదని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. ఎనిమిది గంటలపాటు పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దీక్ష చేపట్టిన నిమ్మల, పాలకొల్లుతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఎలాంటి రుణభారం లేకుండా ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు రేపటి నుంచి 31 వార్డులలో చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షలలో తెలుగుదేశం పార్టీ నేతలు, గృహ లబ్ధిదారులు పాల్గొంటారని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిరుపేదలకు టిడ్కో గృహాలు ఉచితంగా ఇచ్చేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు.

టిడ్కో గృహాల తాజా పరిస్థితిపై సర్కార్ చెప్పింది ఇది
ఇదిలా ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళ కోసం లబ్ధిదారుల వాటా చెల్లించినప్పటికీ, బ్యాంకుల నుండి రావాల్సిన రుణం రాకపోవడం వల్లనే టిడ్కో ఇళ్ళ ప్రయోజనం లబ్ధిదారులకు అందించలేకపోతున్నామని చెబుతోంది. ఈ డిసెంబర్ నెలాఖరులోగా 40,000 ఇళ్లను అప్పగించాలనే లక్ష్యంతో ఉన్నామని ఏపీ టిడ్కో ఎండి శ్రీధర్ ఇప్పటికే వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఇవ్వడం లేదని, అద్దె ఇళ్ళలో ఉంటూ ఆర్ధిక భారం భరించలేక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య యుద్ధం ఆపి త్వరితగతిన తమ గృహాలను తమకు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications