తెలంగాణ ఆసంతృప్తిపై నిర్మలా సీతారామన్, ప్రత్యేక హోదాపై నో కామెంట్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నిర్లక్ష్యం, చిన్నచూపు లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. కేంద్రానికి అన్ని రాష్ర్టాలూ సమానమేనని తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ రూపంలో రూ. 350 కోట్లు కేటాయించామని, తెలంగాణ రాష్ర్టానికి కూడా త్వరలోనే ఇలాంటి ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణకు ఆర్థిక సాయాన్ని ప్రకటించకపోవడం చిన్నచూపు కాదని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వచ్చే ఐదేళ్లలో నెరవేరుస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడానికి చాలా కసరత్తు చేశామని, దాంతో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె అన్నారు. తప్పనిసరిగా రెండు రాష్ర్టాలకూ న్యాయం చేయాలన్నదే కేంద్రం అభిమతమని, ఏ రాష్ట్రం పట్లా చిన్నచూపు లేదని తెలిపారు. అన్ని రాష్ర్టాల అభివృద్ధిపై కేంద్రానికి ప్రత్యేక దృష్టి ఉందని చెప్పారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీల విషయంలోనూ రెండు రాష్ర్టాల అవసరాలను, అభివృద్ధిని పరిగణనలోకి తీసుకున్నామని ఆమె వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంపై వస్తున్న విమర్శలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. చాలామంది ఎంపీలు మాట్లాడినదానికి తాను స్పందించలేనని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని మోడీ పనితీరుకు సంబంధం ఉందని మంత్రి అన్నారు. ప్రధాని స్వయంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కాబట్టి మోడీకీ సంబంధం లేదని భావించలేమని, తప్పనిసరిగా మోడీతి సంబంధం ఉందని చెప్పారు. అయితే, ఈ ఎన్నికలను మోడీ పనితీరుపై రెఫరెండంగా భావించలేమని అన్నారు.