జగన్ వద్ద నల్లధనం లేదు, చంద్రబాబూ! ఏటీఎం వద్దకు రా: రోజా
విజయవాడ: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఎలాంటి నల్లధనం లేదని, తాము ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదని నగరి ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రోజా మంగళవారం నాడు అన్నారు.
బ్యాంకుల వద్ద క్యూ వెనుక.., జన్ ధన్ యోజనపై నిఘా
జగన్ వద్ద నల్లధనం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా ఈ రోజు స్పందించారు. తమ అధినేత వద్ద ఎలాంటి నల్లధనం లేదన్నారు. జగన్ ప్రజా సమస్యల పైన పోరాడుతున్నారని చెప్పారు. రూ.2వేల నోటుకు చిల్లర లేక జనాలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులకు బౌన్సర్లుగా పని చేస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. బీచ్ లవ్ ఫెస్టివెల్ పేరుతో విదేశీ సంస్కృతిని ప్రోత్సహిస్తూ, మన యువతను చంద్రబాబు ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు నల్లధనంపై లేఖలు రాశారని అందరు అనుకుంటున్నారన్నారు.
చంద్రబాబుకు మొదటి నుంచి పక్కవాళ్లమీద ఆదారపడటం అలవాటుగా మారిందన్నారు. టిడిపిలో ఉన్నవాళ్లంతా నల్ల కుబేరులేనని మండిపడ్డారు. అందుకే వాళ్లకు కష్టాలు తెలియడం లేదన్నారు. నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకే చంద్రబాబు విదేశాల పర్యటన చేస్తారన్నారు.
బీర్ బ్రాండ్, చీప్ లిక్కర్ బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏటీఎంల వద్ద ధర్నాలు చేసే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పడం విడ్డూరమన్నారు. ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి ఏటీఎం, బ్యాంకుల వద్ద ప్రజల సమస్యను చంద్రబాబు అడిగి తెలుసుకోవాలన్నారు. వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే ధైర్యం బాబుకు లేదన్నారు.
రిటైల్ వ్యాపారుల ఇబ్బందులు: సురవరం
నల్ల ధనం పైన తాము పోరాటం చేస్తామని లెఫ్ట్ పార్టీ నేత సురవరం అన్నారు. నోటు రద్దు పైన ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. అందుకో ఇన్ని ఇబ్బందులు అన్నారు. రిటైల్ వ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
నోట్ల రద్దు, మార్పిడి పైన గడువును పెంచాలని డిమాండ్ చేశారు. పనామా లీక్స్ కుబేరుల పైన చర్యలు తీసుకోవాలన్నారు. విదేశాల్లోని నల్లధనం తెప్పిస్తానని మోడీ మాట తప్పారన్నారు. రూ.2వేలకు చిల్లర దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రధాని మోడీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.