ప్రత్యర్ధుల ఊహకందని జగన్-మైండ్ గేమ్ లో ఫుల్ సక్సెస్-విపక్షాలపై పైచేయి అందుకే
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న పోరులో వైఎస్ జగన్ పదే పదే పైచేయి సాధిస్తుండటం వెనుక పలు ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేతగా జగన్ మొదలుపెట్టిన మైండ్ గేమ్ వ్యూహాలు ఇప్పటికీ నిరాటంకంగా సాగిపోతుండగా.. ఇప్పడు అవి మరికాస్త రాటుదేలినట్లే కనిపిస్తున్నాయి. ముుఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు, వాటిని అడ్డుకునేందుకు టీడీపి చేస్తున్న ప్రయత్నాలు.. చివరికి ఓడినా తనదే పైచేయిగా జగన్ మార్చుకుంటున్న తీరుపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
జగన్ వర్సెస్ చంద్రబాబు
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ పోరుకు పదేళ్ల చరిత్ర ఉంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు టీడీపీ పరోక్ష మద్దతు అందించడం ద్వారా మొదలైన పోరు ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. మధ్యలో ఇద్దరికీ కొన్ని తీపి, చేదు అనుభవాలు, అధికార, విపక్ష భేదాలు తప్ప మిగతాదంతా సేమ్ టూ సేమ్ గా సాగిపోతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా... వైసీపీనీ, వైసీపీ అధినేత జగన్ నూ ఎలా టార్గెట్ చేసిందో ఇప్పుడు సరిగ్గా అంతకు రెండింతలు జగన్ టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. దీంతో జగన్, చంద్రబాబు పోరు రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది.
జగన్ మైండ్ గేమ్ మొదలైంది అక్కడే
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా.. వైసీపీ విపక్షంలో ఉండేది. అప్పట్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలోకి విచ్చలవిడిగా ఫిరాయించే వారు. దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ అధినేత జగన్ ఏమాత్రం ప్రయత్నాలు చేసే వారు కాదు. కేవలం టీడీపీ సంతలో పశువుల్ని కొన్నట్లుగా తమ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తోందని ఆరోపణలు మాత్రం చేసేవారు. అంతటితో ఆగకుండా త్వరలో టీడీపీ నుంచి కీలక నేతలు, ఎమ్మెల్యేలు తమ గూటికి వస్తారంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు. దీంతో అధికార పార్టీ అయిన టీడీపీని వదిలి విపక్ష వైసీపీకి నేతలు ఎందుకు వెళ్తారన్న చర్చ మొదలైంది. ఆ చర్చ కాస్తా ఆ తర్వాత మరింత తీవ్రమై 2019 ఎన్నికల నాటికి చాలా మంది టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరిపోయారు. ఆ తర్వాత ప్రజలే వారికి ఆమోదముద్ర కూడా వేసేశారు.
ఎన్డీయే నుంచి టీడీపీని బయటకు తెచ్చిన ప్లాన్
గతంలో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసి కేంద్ర, రాష్ట్రాల్లో విజయాలు సాధించాయి. వీరిద్దరి కాపురం సవ్యంగా సాగిపోతున్న తరుణంలో జగన్ మైండ్ గేమ్ మొదలుపెట్టారు. అప్పట్లో కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల్ని అమలు చేయడం లేదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా కూడా సాధించలేకపోతోందని జగన్ విమర్శించేవారు. ప్రజల్లో దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. చివరికి టీడీపీ కేంద్రంలోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమనే స్ధాయిలో మైండ్ గేమ్ ప్రచారం సాగింది. దీంతో టీడీపీ వైసీపీ మైండ్ గేమ్ ట్రాప్ లో పడి కేంద్రానికి గుడ్ బై చెప్పేసింది. జగన్ అంతటితో ఆగలేదు. టీడీపీ కేంద్రంలో పదవులు వదులుకున్నా ఇంకా ఎన్డీయేలోనే ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. దీంతో చివరికి టీడీపీ ఎన్డీయేకు గుడ్ బై చెప్పడం, బయటికొచ్చి బీజేపీపై ధర్మపోరాటం చేయడం, ఘోర పరాజయంతో ఇంట్లో కూర్చోవడం వరుసగా జరిగిపోయాయి.
ఇప్పటికీ జగన్ అదే మైండ్ గేమ్
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ అదే మైండ్ గేమ్ కొనసాగిస్తున్నారు. కీలకమైన అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా దానిపై టీడీపీ విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతున్నారు. చివరికి కోర్టుల్లో అవి చెల్లవని తెలిసీ ముుందడుగు వేస్తున్నారు. అంతిమంగా కోర్టులు వాటిని కొట్టేయడంతో టీడీపీ ప్రజా హిత నిర్ణయాలను అడ్డుకుంటోందని మరో ప్రచారానికి తెరదీస్తున్నారు. దీంతో ప్రజల్లోనూ ప్రభుత్వం తమ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే టీడీపీ అడ్డుపడుతోందన్న భావన వ్యక్తమవుతోంది. ఇళ్ల స్ధలాల పంపిణీతో మొదలుపెట్టి ఇంగ్లీష్ మీడియం, డిగ్రీ కాలేజీల్లో తెలుగు మీడియం రద్దు, తాజాగా టీటీడీ జంబో బోర్డు ఇలా ప్రతీ విషయంలోనూ జగన్ మైండ్ గేమ్ నిరాటంకంగా సాగిపోతోంది.
మూడు రాజధానులపైనా అదే గేమ్
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను జగన్ అంత్యంత వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. తద్వారా టీడీపీపై మరో మైండ్ గేమ్ పాచిక విసిరారు. మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తున్నారన్న భావన ప్రజల్లో కల్పిస్తున్నారు. దీంతో మూడు రాజధానుల్ని అడ్డుకునేందుకు టీడీపీకి ఏం చేయాలో పాలుపోని పరిస్ధితి. ఇప్పుడు ఇందులో ఏ రాజధానిని వ్యతిరేకించినా అక్కడి ప్రజల దృష్టిలో టీడీపీ నేతలు విలన్లుగా మారడం ఖాయం. అందుకే మూడు రాజధానుల వ్యవహారాన్ని కోర్టులకు వదిలిపెట్టి టీడీపీ మిగతా అంశాలపై పోరు సాగిస్తోంది. తద్వారా జగన్ ఇక్కడా మైండ్ గేమ్ లో విజయం సాధించినట్లేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
అప్పులపైనా అదే ప్లాన్
రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కానీ వీటిని అమలు చేసేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు. ఎప్పుడో టీడీపీ హయాంలోనే ఖజానా ఖాళీ అయిపోయింది. దీంతో రోజు రోజుకూ భారీ స్ధాయిలో ప్రభుత్వం అప్పులు తీసుకొస్తోంది. వీటిపై విపక్ష టీడీపీ రోజూ విమర్శలు చేస్తూనే ఉంది. అయినా వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. అదేమని అడిగితే ప్రజల కోసం భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, ఆ మాత్రం అప్పులు చేయకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నిస్తోంది. దీంతో సంక్షేమ పథకాల్ని ఆపమని చెప్పే ధైర్యం లేక, అప్పుల్ని రోజూ విమర్శిస్తూ టీడీపీ కాలం గడిపేస్తోంది.
జగన్ మైండ్ గేమ్ ఫుల్ సక్సెస్
విపక్షాల్ని తన మైండ్ గేమ్ తో ప్రతీ విషయంలో కట్టి పడేస్తున్న సీఎం జగన్ అప్రతిహతంగా తన మైండ్ గేమ్ ప్లాన్ వర్కవుట్ చేస్తున్నారు. తాను చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ తనకు మైలేజ్ దక్కేలా... విపక్ష పార్టీలు విమర్శిస్తే వారికి రాజకీయంగా నష్టం చేకూరేలా జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో ఎప్పుడో విపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చినా సరే టీడీపీపై పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఎన్నికల సంగతి సరే సరి. ఇలా ప్రతీ విషయంలోనూ జగన్ నేరుగా దాడి కంటే మైండ్ గేమ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో విపక్ష పార్టీలు కూడా పదే పదే విమర్శలు చేయడం మినహా నేరుగా ఏ ప్రభుత్వ నిర్ణయానికీ అడ్డుతగలని పరిస్ధితి క్రియేట్ చేసేస్తున్నారు.