కొత్త ఏడాదిలో విపక్షాల ముప్పేట దాడి-అక్కడ స్పేస్ ఇవ్వని జగన్-అందులో మాత్రం క్లీన్ చిట్
ఏపీలో కొత్త ఏడాదిలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తుండగా.. మరోవైపు బీజేపీ నేత సోము వీర్రాజు మత రాజకీయాల్ని తెరపైకి తెస్తూ ప్రభుత్వానికి కంటగింపుగా మారుతున్నాయి. అయినా వీరిద్దరికీ ఓ విషయంలో మాత్రం సీఎం జగన్ అస్సలు స్పేస్ ఇవ్వడం లేదు. దీంతో మిగతా అంశాల్లో ఎలా ఉన్నా అక్కడ మాత్రం విపక్షాలకు పట్టు చిక్కడం లేదు.

కొత్త ఏడాదిలో ఏపీ రాజకీయం
కొత్త ఏడాదిలో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. కొత్త ఏడాది ఆరంభానికి ముందే తిరుపతిలో అమరావతి రాజధాని సభ రూపంలో ఏకమైన విపక్షాలు కొత్త ఏడాదిలో కొత్త కొత్త వ్యూహాలకు తెర దీస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలపై విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కొత్తగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి అందివచ్చే ఏ ఒక్క అంశాన్నీ వదులుకోరాదని విపక్షాలు భావిస్తున్నాయి.
దీంతో కొత్త ఏడాది వైసీపీ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది. అసలే ఓవైపు అప్పులతో నడుస్తున్న రాష్ట్రంలో పథకాలను గత రెండేళ్ల తరహాలోనే అమలు చేయడంతో పాటు కొత్త తప్పిదాలు చేయకుండా జాగ్రత్తపడటం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ముందున్న సవాలు.

గేరు మార్చిన టీడీపీ
వైసీపీ సర్కార్ విధానాలపై రెండేళ్లుగా పోరాటం చేస్తున్న టీడీపీకి ఆశించినంతగా ఫలితాలు రాలేదు. దీంతో కొత్త ఏడాదిలో వ్యూహం మార్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సంప్రదాయ రాజకీయాలతో వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం కాదని భావిస్తున్న చంద్రబాబు..ఈ ఏడాదిలో ఓవైపు పార్టీని క్షేత్రస్ధాయి నుంచి బలోపేతం చేసుకుంటూనే మరోవైపు ప్రభుత్వంపై ఎదురుదాడిని తీవ్రతర చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
అయితే ఇది గతంలోలా మీడియానో, ఇతర వర్గాలనో నమ్ముకుని కాకుండా డిజిటల్, ఇతరత్రా విధానాల్లో, నేరుగా ప్రజలకు చేరువయ్యేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

జోరు పెంచిన బీజేపీ
అదే సమయంలో మరో విపక్షం బీజేపీ కూడా అధికార వైసీపీని ఇరుకునపెట్టేందుకు అందివచ్చిన ఏ అంశాన్నీ వదులుకోవడం లేదు. అంతే కాదు రాష్ట్రంలో ఇప్పటివరకూ వివాదాల్లో లేని అంశాల్ని సైతం కొత్తగా తెరపైకి తెస్తూ వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే జిన్నాటవర్, వైజాగ్ కేజీహెచ్ పేరు మార్పుఅంశాలు తెరపైకి వచ్చాయి. ఆల్రెడీ తమ అజెండాలో ఉన్న మతమార్పిడులు, దేవాలయాలపై దాడులు వంటి అంశాలకూ పదునుపెడుతోంది. దీంతో బీజేపీని మతపరమైన కోణంలో ఎదుర్కోవడం వైసీపీకి కష్టంగా మారుతోంది.

అక్కడ మాత్రం జగన్ కు క్లీన్ చిట్
ఏపీలో విపక్షాలు ప్రభుత్వ విధానాలనో, వివాదాస్పద అంశాలతో, పథకాల్లో లోపాలనో తెరపైకి తెచ్చి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా ఓ విషయంలో మాత్రం వారికి పట్టు చిక్కడం లేదు. అదే అవినీతి. గతంలో అవినీతి పేరుతో జగన్ తండ్రి వైఎస్ ను, ఆయన మరణం తర్వాత జగన్ ను కూడా టార్గెట్ చేసి జైలుకు పంపిన విపక్షాలు.. ఇప్పుడు మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించేందుకు సైతం సాహసించడం లేదు.
దీనికి కారణం ఎక్కడా అవకాశం దక్కకపోవడమే. ప్రభుత్వం ఏడాదికి దాదాపు లక్ష కోట్లను పథకాల రూపంలో పంచుతున్నా అందులో అవినీతి ఉందని చెప్పేందుకు విపక్షం సాహసించకపోవడం కచ్చితంగా జగన్ సర్కార్ కు భారీ ఊరటనిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు కొరడా ఝళిపిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఆ విషయంలో మాత్రం విపక్షాలు జగన్ కు క్లీన్ చిట్ ఇవ్వక తప్పడం లేదు.












Click it and Unblock the Notifications