జగన్ సీఎం కాలేరు, ఎవరూ చెప్పినా వినరు: వైసీపీ మాజీ నేత, బాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా, ఏం చేసినా ముఖ్యమంత్రి కాలేరని ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన చిత్తూరు మాజీ జెడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్య రెడ్డి విమర్శించారు. ఈయన వైసీపీకి రాజీనామా చేసి ఆ తర్వాత చంద్రబాబును కలిశారు. టీడీపీలో చేరారు.
తాజాగా, జగన్ ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం రెడ్డి స్పందించారు. జగన్ ముఖ్యమంత్రి అవుతానని కలలు కుంటున్నారని, కానీ అది నెరవేరదని చెప్పారు. జగన్ నిరంకుశ వైఖరి కారణంగానే ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు.

జగన్ అతివిశ్వాసం వల్లే
వైయస్ జగన్మోహన్ రెడ్డికి అతి విశ్వాసం ఉందని, అలాగే తాను చెప్పిందే నడవాలని సుబ్రహ్మణ్యం రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీలో ఎవరూ ఉండటం లేదన్నారు. సీనియర్లు చెప్పిన మాటలు వినిపించుకోరని ఆరోపించారు. సీనియర్లు ఏం చెప్పినా పరిగణలోకి తీసుకోరని విమర్శించారు.

హెరిటేజ్ సంస్థ కోసం
మరోవైపు, జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం సీఎం చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాలో సహకార సంఘంలో నిర్వహిస్తున్న పరిశ్రమలను మూయించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. లాభాలతో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట సహకార చక్కెర కర్మాగారాలను మూయించారన్నారు. తన సొంత పాల డెయిరీ హెరిటేజ్ సంస్థ అభివృద్ధికి చిత్తూరు విజయ సహకార పాలడెయిరీని మూయించిన ఘనుడు చంద్రబాబు అన్నారు.
Recommended Video


చంద్రబాబు ఇలా మూయించేశారని జగన్ సంచలనం
పాల డెయిరీ పాలకవర్గ సభ్యులుగా తన నమ్మకస్తులను నియమించి అది మూతపడేలా చేశారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అంటే ప్లాన్ ప్రకారమే దానిని మూయించారని అభిప్రాయపడ్డారు. చక్కెర కర్మాగారాలను వైయస్ రాజశేఖర రెడ్డి రూ.51 కోట్లు నిధులు విడుదల చేసి పునఃప్రారంభించారన్నారు. మళ్లీ ఆయన అధికారంలోకి రాగానే వాటిని మూయించినట్లు తెలిపారు.

చంద్రబాబు సొంత లాభం కోసం
చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు తన సొంత లాభం కోసం పరిశ్రమలు మూయించారని జగన్ ఆరోపించారు. అలాంటి వ్యక్తిని ఏమనాలని ప్రశ్నించారు. జిల్లాలో నల్లబెల్లం పండే భూమలు ఉన్నాయని, అయితే చంద్రబాబు నల్లబెల్లం తయారు చేయకూడదని జీవోలు ఇప్పించారన్నారు. జగన్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం పెనుమూరు మండలంలోని బండకిందపల్లె, రాఘవరెడ్డిపల్లె, మానిక్యరాయునిపల్లె, కార్తికేయపురం, అట్లవారిపల్లె మీదగా పెనుమూరు, గొబ్బిళ్లమిట్ట, గాంధీపురం, చిప్పారపల్లె వరకు సాగింది.












Click it and Unblock the Notifications