ధైర్యం చేయరు: కిరణ్ మార్పుపై నేతలు, కన్నా మరోసారి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్పు ఉండదని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు చెబుతున్నారు. శుక్రవారం నేతలు ముఖ్యమంత్రి మార్పు అంశంపై స్పందించారు. ముఖ్యమంత్రిని మార్చే ధైర్యాన్ని అధిష్టానం చేయక పోవచ్చునని మంత్రి శైలజానాథ్ అన్నారు. విభజన తీర్మానం లేకుండా రాష్ట్రాలు ఏర్పడిన చరిత్ర లేదన్నారు. అన్ని పార్టీలు విభజనను వ్యతిరేకించాలని సూచించారు.
సమైక్యవాదినే: పళ్లం రాజు
తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని కేంద్రమంత్రి పళ్లం రాజు తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు. తామంతా సమైక్యం కోసమే పోరాడుతున్నామన్నారు. విడిపోతే అన్నీ నష్టాలేనని, జలవివాదాలు తప్పవన్నారు. సీమాంధ్ర ప్రాంతం ఆర్థికంగా నష్టపోతుందని అధిష్టానానికి చెప్పామన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదన్నారు.
విభజన ఆగుతుంది: గంటా
విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని అధిష్టానం ఇప్పటికే ఓ తప్పు చేసిందని, ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా మరో తప్పు చేస్తుందని తాము భావించడం లేదని విశాఖలో గంటా శ్రీనివాస రావు అన్నారు. విభజన ప్రక్రియ ఏదో ఒకస్థాయిలో ఆగిపోతుందన్నారు. పార్లమెంటులోనైనా, అసెంబ్లీలోనైనా సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు బిల్లును అడ్డుకుంటారన్నారు.
మరోసారి ఖండిస్తున్నా: కన్నా
ముఖ్యమంత్రిని మారుస్తారనే వార్తలను తాను ఖండిస్తున్నానని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి చెప్పారు. సిఎం మార్పు విషయంపై నిన్ననే ఖండించానని, ఇప్పుడు మళ్లీ ఖండిస్తున్నానన్నారు. తాను కేవలం కాంగ్రెసు పార్టీ కార్యకర్తగా సోనియాను కలిశానన్నారు.