ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ అన్నాను, ఉలిక్కిపడాల్సిందేముంది: చంద్రబాబు
విజయవాడ: రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సభలో ప్రత్యేక హోదా బదులు తాను ప్యాకేజీ అన్నానని, ఇందులో ఉలిక్కిపడాల్సింది ఏముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి తాను స్పష్టంగా వివరించానని ఆయన చెప్పారు. తాను ఎక్కడా రాజీ పడడం లేదని ఆయన అన్నారు. నిన్న తాను చాలా బ్యాలెన్స్గా మాట్లాడానని చెప్పుకున్నారు. ప్రత్యేక హోదా అనబోయి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి సమన్యాయం చేయాలని కోరానని చెప్పారు.
చంద్రబాబు శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. శంకుస్థాపనకు రానివాళ్లు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని వద్దనుకున్నవాళ్లే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.నీతి ఆయోగ్ త్వరలోనే నివేదిక ఇస్తుందని చెప్పారు. రాజధాని నిర్మాణంలో రెండు దేశాలు భాగస్వాములయ్యాయని, మరిన్ని దేశాలు ముందుకు వస్తాయని ఆయన అన్నారు.
రాజధాని పేరు, వాస్తు బాగున్నాయని, మౌలిక సదుపాయాలే సరిగా లేవని ఆయన అన్నారు. అమరావతి శంకుస్థాపనకు కొందరిని వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయానని అన్నారు. పవిత్ర భావనతో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉపవాస దీక్షలో ఉండి కూడా వచ్చారని ఆయన అన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేశారని ఆయన అభినందించారు.
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దుతామని చెప్పారు. నీరు - మట్టి పవిత్రమైన పూజలతో తెచ్చామని అన్నారు. శక్తులున్న ప్రాంతాల నుంచి వాటిని తెచ్చినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణంతో నూతన శకానికి నాంది పలుకుతామని, భవిష్యత్తును ముదుకు తీసుకుపోయే విధంగా తీర్చి దిద్దుతామని చంద్రబాబు అన్నారు. పవిత్రమైన నమ్మకంతో ముదుకు వెళ్లేలా చేస్తుందని, నమ్మకమే ప్రపంచాన్ని నడిపిస్తోందని అన్నారు.
రాజధాని శంకుస్థాపనకు దేశవిదేశాల్లోనివారిని పద్ధతి ప్రకారం ఆహ్వానించామని అన్నారు. సంప్రోక్షణ చేసి రాజధాని ప్రాంతాన్ని పునీతం చేసినట్లు తెలిపారు. వచ్చినవారంతా మనసావాచా ఆశీర్వదించారని చెప్పారు. రాజధాని నిర్మాణంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు భాగస్వాములయ్యే అవకాశం ఉందని అన్నారు. భారతదేశంలో ఇటువంటి శుభకార్యం ఎప్పుడూ జరగలేదని అన్నారు. వినూత్నమైన, పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు.
కేంద్రం, ప్రధాని సహకారం పూర్తిగా అందుతుందనే విశ్వాసం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సహకరిస్తానని చెప్పడం సంతోషకరమని అన్నారు.