పరిటాల టు జుబ్లీహిల్స్ బాంబు.. ఇదీ నీ నేర చరిత్ర: ఉమ, కుక్కలతో పోల్చిన జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం పైన ఏపీ శాసన సభలో సోమవారం మధ్యాహ్నం చర్చ ప్రారంభమైంది. చర్చ సమయంలో టిడిపి ఎమ్మెల్యే బోండ ఉమ వైసిపి అధినేత జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ టిడిపి సభ్యులను పరోక్షంగా కుక్కలతో పోల్చారు.
టిడిపి ఎమ్మెల్యే బోండ ఉమ మాట్లాడుతూ.. జగన్ వైఖరి నచ్చకే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తానని జగన్ రాజ్ భవన్ సాక్షిగా హెచ్చరించారన్నారు. అధికార కాంక్షతో అవిశ్వాస తీర్మానం పెట్టారని, వైసిపి ఎమ్మెల్యేలే దీనిని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
సమర్థవంతమైన నాయకత్వాన్ని, అనుభవం కలిగిన నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకున్నారని, అందుకే టిడిపిని గెలిపించి, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేశారన్నారు. కానీ జగన్ అధికార దాహంతో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాపు గర్జన సమయంలో వైసిపి కుట్రను ప్రజలు గుర్తించారన్నారు. రైళ్లు తగులబెట్టారని, ప్రజలను కొట్టారన్నారు. పులివెందుల నుంచి రౌడీలను తీసుకు వచ్చి కొట్టారన్నారు. గంటలో ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ సవాల్ చేయడం విడ్డూరమన్నారు.

ఇదీ జగన్ నేర చరిత్ర తెలుసుకోండి
ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోయాలని జగన్ అనుకుంటున్నారో చెప్పాలన్నారు. తమకు చెప్పకపోయినా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పరిటాల రవి హత్యలో జగన్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్ కారు బాంబు దాడి వెనుక జగన్ ఉన్నారని స్వయంగా మంగలి కృష్ణనే చెప్పారన్నారు.
ప్రతిపక్ష నేతది నేర చరిత్రను అందరూ తెలుసుకోవాలన్నారు. నదుల అనుసంధానం చేసినందుకు, రుణమాఫీ చేసినందుకు, పోలవరం ప్రాజెక్టును కడుతున్నందుకు, ప్రపంచస్తాయి రాజధానిని నిర్మిస్తున్నందుకు, రాయలసీమకు నీళ్లు ఇస్తున్నందుకు అవిశ్వాసం పెట్టారా చెప్పాలన్నారు.
పార్టీలో కానీ, లోటస్ పాండులో కానీ జగన్ తీరు నచ్చకే ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. అలిపిరి దాడి ఘటనకు కారణమైన నక్సలైట్లకు సహకరించిన వ్యక్తి గంగిరెడ్డి అని, ఆయనతో వీరికి సంబంధముందని ధ్వజమెత్తారు.
ఆ రికార్డ్ జగన్ సొంతం.. జగన్ ఆర్థిక ఉగ్రవాది
ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి కొడుకు పైన 11 కేసులు, ఛార్జీషీట్లు ఉండటం ఈ భారత దేశంలో జగన్కే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. ఆయన పైన 420 కేసులు కూడా ఉన్నాయన్నారు. జగన్ ఓ ఆర్థిక ఉగ్రవాది అని మండిపడ్డారు. ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి తమను ఎన్ని అన్నా భరిస్తున్నామన్నారు.
420 కేసులు, 11 ఛార్జీషీట్లు, 16 నెలలు జైలులో ఉన్న ముఖ్యమంత్రి కొడుకుగా జగన్ రికార్డ్ సృష్టించాడని బోండ ఉమ ఎద్దేవా చేశారు.
బోండ ఉమ తన ప్రసంగంలో జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ది ఆది నుంచి నేర చరిత్రే అన్నారు. కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పైన 22 ఏళ్ల వయస్సులోనే దాడి చేసిన జగన్, అక్కడి పోలీసులపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు జగన్ పై కేసులు కూడా నమోదయ్యాయన్నారు.
అంతేకాకుండా సదరు ఘటనకు సంబంధించి ఆధారాలనూ ఆయన ప్రదర్శించారు. ఇక మొన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనలో జరిగిన విధ్వంసానికి జగన్ ఇలాకా పులివెందుల నుంచి వచ్చిన రౌడీలే కారణమన్నారు.
గజరాజు నడుస్తుంటే కుక్కలు మొరుగుతున్నాయి: జగన్
టిడిపి ఎమ్మెల్యేలు శ్రవణ్, బోండ ఉమ మాట్లాడిన తర్వాత జగన్ కౌంటర్ ఇచ్చారు. గజరాజు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయని ఎద్దేవా చేశారు. తద్వారా తనను ఏనుగుతోను, టిడిపి నేతలను కుక్కలతో పోల్చారు. తనకు తన పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పిన కథను చెప్పానని తెలిపారు.
జగన్ కుక్క వ్యాఖ్యల పైన యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ జరుగుతున్న తీరు చూస్తుంటే బాధేస్తోందన్నారు. సభ్యులను కుక్కలతో పోల్చవద్దన్నారు. దానికి జగన్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ రెడ్డి చెప్పిన కథను చెప్పానని, దానికి టిడిపి భుజాలు తరుముకుంటోందన్నారు. టిడిపి నేతల ప్రసంగాలు చెవులకు ఇబ్బంది కలిగించాయన్నారు.












Click it and Unblock the Notifications