'తుని ఘటన.. అంబటి, భూమన రెక్కీ': జగన్ కన్ఫ్యూజన్, అది మీ లెక్కే
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం పైన ఏపీ శాసన సభలో సోమవారం మధ్యాహ్నం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కులాల అంశంపై జగన్ మాట్లాడగా.. కాపు గర్జన, తుని ఘటనపై వాగ్యుద్ధం జరిగింది.
జగన్ మాట్లాడుతూ... కాపులు, కురుమ, గాండ్ల, వాల్మీకులు తదితరుల కులాలను ఆయా వర్గాల్లో చేర్చుతామని హామీ ఇచ్చారని, కానీ నెరవేర్చలేదని జగన్ అన్నారు. దానికి ప్రభుత్వ చీఫ్ విఫ్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... కులాల అంశం కేంద్రం పరిధిలోని అంశమని జగన్కు తెలియదా అన్నారు. దానికి జగన్ మాట్లాడుతూ... హామీ ఇచ్చిన సమయంలో అది గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. తాము ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కానీ జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీసీలను, కాపులను రెచ్చగొడుతున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి టిడిపి కృషి చేస్తోందన్నారు. జగన్ సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దన్నారు.
కాపు గర్జన, తుని ఘటనపై వాగ్వాదం
నేను టిడిపి మేనిఫెస్టోను చదివి వినిపిస్తున్నానని, దానిని వారు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బీసీలకు పదివేల కోట్ల రూపాయలతో సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారని, అది ఏమయిందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాపులు ధర్నాలు చేస్తే తప్పు అవుతుందా అని ప్రశ్నించారు.
బిజెపి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి ధైర్యం లేదన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరు అనుకుంటారని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన గురజాడ గేయాన్ని జగన్ చదివి వినిపించారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్ తన స్వార్థ రాజకీయం కోసం కులాలను కూడా సభలో ప్రస్తావించి అగౌరవపర్చుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి అనని మాటలను ప్రస్తావిస్తున్నారన్నారు. ముగ్గురు వ్యక్తులను పెట్టుకొని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
కాపు సోదరుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసిపికి లేదన్నారు. ఏదైనా మంచి చేయాలని ఉంటే జగన్ మంచి సూచనలు ఇవ్వాలన్నారు. జగన్ ఇటు కాపులను, అటు బీసీలను, మరోవైపు ఎస్సీలను రెచ్చగొడుతున్నారన్నారు. తాము ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఏ కులాలు కూడా జగన్ ఉచ్చులో పడవద్దన్నారు.
తునిలా కాపు సోదరుల ముసుగులో దారుణం చేశారన్నారు. జగన్ ఓసారి నిద్రపోయినప్పుడు ఆలోచించాలని అచ్చెన్నాయుడు సూచించారు. రాష్ట్రంలో ఇన్ని కులాలు, ఇంత పేదరికం ఉందని, కాబట్టి జగన్ మంచి సలహాలు ఇవ్వాలన్నారు.
టిడిపి ఎమ్మెల్యే ఆనంద్ రావు మాట్లాడుతూ... జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా చర్చ చేపడితే అందులో జగన్ పాల్గొనలేదన్నారు. బాలయోగిని స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. దళితులకు న్యాయం జరిగిందంటే నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు వల్లే అన్నారు. కానీ వీరి వల్ల కాదన్నారు.
వైసిపి ఎమ్మెల్యే రామలింగేశ్వర రావు మాట్లాడుతూ.. కాపు గర్జన సమయంలో జరిగిన దుర్ఘటనను తమ పార్టీ పైకి తోయడాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. అసలు ఏమిటో విచారణలో తేలుతుందన్నారు. వైసిపి నేతల పైన కేసు పెట్టి వేధిస్తున్నారన్నారు.
టిడిపి ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ... కాపు గర్జనకు ముందు వైసిపి నేతలు కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబులు రెక్కీ నిర్వహించారన్నారు. ఆ తర్వాత దాడికి వ్యూహం పన్నారన్నారు. రెక్కీ నిర్వహించి తుని ఘటనకు పాల్పడింది వైసిపినే అని మండిపడ్డారు.
చినరాజప్ప మాట్లాడుతూ.. తుని ఘటన పైన లోతుగా దర్యాఫ్తు జరుపుతున్నామని చెప్పారు. ఆ ఘటన దురదృష్టకరమన్నారు. అది ప్లాన్తో జరిగిందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబులు అంతకుముందు రోజు అక్కడే ఉన్నారన్నారు.
జగన్ మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తానని మూడు నెలల క్రితం ప్రకటించారని, ఆ దీక్ష ఎక్కడ చేస్తున్నాడో తెలియదా అని ప్రశ్నించారు. అక్కడ భద్రత, బారీకేడ్లు ఏర్పాటు చేయాలని మీకు తెలియదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ రోజు పోలీసులు ఎందుకు కనిపించకుండా పోయారని ప్రశ్నించారు.
ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని టీవీలో అందరం చూశామన్నారు. ఆ రోజు జరిగింది భావోద్వేగంతో జరిగిందన్నారు. లక్షమంది ఒకే వద్దకు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని, బారీకేడ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. బందోబస్తు సరిపోయేంత ఎందుకు పెట్టలేదన్నారు. తుని ఘటనను రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు.
బిజెపి సభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ... తుని ఘటన, రైళ్ల పైన దాడి విషయమై జగన్ మాట్లాడిన తీరు సరికాదన్నారు. రైలు పట్టాల వద్ద బారీకేడ్లు చరిత్రలో ఎప్పుడైనా చూశామా అన్నారు. ఆ రోజు జరిగింది దురదృష్టకరమైన సంఘటన అన్నారు.
వైయస్ పట్టించుకోలేదు: తోట
టిడిపి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ... తమ సామాజిక వర్గాన్ని ఆసరాగా చేసుకొని జగన్ రాజకీయ లబ్ధికి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2004లో కాపులను బీసీల్లో చేర్చుతామని వైయస్ రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చినా పట్టించుకోలేదన్నారు.
కాపులను బీసీల్లో చేర్చాలని కమిషన్ వేస్తే.. దానికి డబ్బులు కావాలంటే కూడా ఇవ్వని వ్యక్తి వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. కానీ చంద్రబాబు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. కాపు ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎప్పుడూ వారి గురించి ఆలోచించలేదన్నారు.
జగన్ మాట్లాడుతూ.. మాటిమాటికి వైయస్ పేరు ఎత్తుతున్నారని, 1994లో చంద్రబాబు హామీ ఇచ్చారు కదా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు ఏ విషయం తెలియదా అని ప్రశ్నించారు. జగన్ అప్పుడు ఎందుకు కాపుల సమస్యను పరిష్కరించలేదన్నారు.
తుని ఘటన పైన చంద్రబాబు చేతిలో ఉన్న సిఐడితో విచారణ జరిపిస్తే పొలిటికల్ రంగు మారుతుందని, కానీ సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తుని ఘటన పైన సిబిఐ విచారణ కోరుతూ తాము కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ను కలిశామని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే సిబిఐతో విచారణ జరిపించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలపై చంద్రబాబుకు ఎంతో ప్రేమ
జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఎస్సీ, బీసీ, ఎస్టీల పైన ఎంతో ప్రేమ ఉందని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన మేర ఖర్చు చేయలేదన్నారు. ఎస్సీలకు ఖర్చ చేయాల్సిన నిధులను ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. దేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదంటే అది ఏపీ ప్రభుత్వమే అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ను దారి మళ్లించారన్నారు. దళితులను మోసం చేశాడన్నారు. నిరుద్యోగులను వెనకబాటులో ముంచేందుకు కారణమయ్యాడన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నా్రు.
జగన్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం చదివినట్లుగా లేదని ఎద్దేవా చేశారు. దానిని చదవాలని హితవు అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీల కోసం తాము ఎన్నో పథకాలు తీసుకు వచ్చిందన్నారు.
జగన్ మాట్లాడుతూ... మీరు బడ్జెట్లో చెప్పిందే నేను చెబుతుంటే మీరు మాట్లాడటం ఆశ్చర్యం వేస్తోందన్నారు.
యనమల మాట్లాడుతూ... జగన్ చాలా కన్ప్యూజన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయా కులాలకు కేటాయించిన నిధుల విషయంలో జగన్ కన్ఫ్యూజన్లో ఏదేదో చెబుతూ, తమనూ కన్ఫ్యూజన్లో పడేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అన్నీ తెలుసుకొని మాట్లాడాలన్నారు.
జగన్ మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన బుక్కు ఆధారంగానే నేను మాట్లాడుతున్నానని చెప్పారు. మీ అంతట మీరు చూపిన లెక్కలనే నేను చూపిస్తున్నానని జగన్ కౌంటర్ ఇచ్చారు. బిసి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై చెప్పిన దానికి, చేసేదానికి పొంతన లేదన్నారు.