జగన్ ఛాంబర్లోకి వాటర్ లీక్ పై తేల్చేసిన సిఐడి డిజి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిజి ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు అసెంబ్లీలోని జగన్ ఛాంబర్ లోకి వర్షపునీరు చేరింది.ఈ ఘటనపై స
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిజి ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు అసెంబ్లీలోని జగన్ ఛాంబర్ లోకి వర్షపునీరు చేరింది.ఈ ఘటనపై స్పీకర్ సిఐడి విచారణకు ఆదేశించారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఘటనతో అసెంబ్లీ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ వ్యవహరం టిడిపికి రాజకీయంగా ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
దీంతో ఈ ఛాంబర్ ను పరిశీలించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు సిఐడి విచారణకు ఆదేశాలను జారీ చేశారు. అయితే నీళ్ళు లీకేజైన ప్రాంతంలో పైపులైన్ ను కోసివేసినట్టుగా గుర్తించినట్టుగా డిజి చెప్పారు. కోసిన పైపును అలాగే వదిలేశారని ఆయన చెప్పారు.
అసెంబ్లీ నిర్మాణంపై కాంట్రాక్టర్లతో కూడ మాట్లాడినట్టు తిరుమలరావు చెప్పారు. మంగళవారం నాడు ఆయన రాజమండ్రిలో సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20 నుండి 27వరకు అగ్రిగోల్డ్ ఆస్తులను ఈ వేలం వేయనున్నట్టు ద్వారకా తిరుమలరావు చెప్పారు.
మదుపరులకు రూ.1180 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. తొలుత హయ్ లాండ్ , విశాఖలోని యారాడ వద్ద ఉన్న విలువైన ఆస్తులను విక్రయించి మదుపర్లకు బకాయిలను చెల్లించనున్నట్టు చెప్పారాయన. అగ్రిగోల్డ్ సంస్థలో సుమారు 32 లక్షల మంది ఖాతాదారులు, 19 లక్షల మంది మదుపరులున్నారని చెప్పారు.
ప్రతినెలా ఈ వేలం ద్వారా సంస్థ ఆస్తులను విక్రయించి బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకొంటామన్నారు. అగ్రిగోల్డ్ కేసులో మొత్తం 19 మంది నిందితుల్లో 15 మందిని అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు.అలాగే అక్షయగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులను ఈ నెల 21 నుండి 28 వరకు ఈ వేలం ద్వారా విక్రయించనున్నట్టు చెప్పారు.