వివాదం లేదు, పార్టీ పేరొద్దు: పోలవరంపై వెంకయ్య
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై వివాదం ఏమిలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. యూపిఏ ప్రభుత్వం తన హయాంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు, ముంపు గ్రామాలపై అప్పుడే నిర్ణయం జరిగిందని తెలిపారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదం చేసిన సందర్భంలోనే ముంపు గ్రామాలను సీమాంధ్ర ప్రాంతానికి కేటాయించడం జరిగిందని వెంకయ్య నాయుడు తెలిపారు. అప్పుడు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా సంబరాలు జరుపుకున్నాయని అన్నారు. ఆ పార్టీ కూడా సంబరాలు జరుపుకుందని, తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ప్రస్తావించకుండా చెప్పారు.
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ గురువారం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది కాదా.. దీనిపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రశ్నించగా.. ఆ పార్టీపై స్పందించనని తెలిపారు. ప్రాజెక్టుపై ఎలాంటి వివాదం లేదని చెప్పారు.
తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం ఇస్తుందని వెంకయ్య నాయుడు తెలిపారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాల పంట సాగులోకి వస్తుందని తెలిపారు.