ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్-జీపీఎస్ పింఛన్ ఫైనల్- పాత విధానం అమలుకు నో..
ఏపీలో సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ అమలు కోరుతూ ఉద్యమిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ బారీ షాకిచ్చింది. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చల్లో ఈ మేరకు కొత్త విధానం మాత్రమే అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో కొత్త విధానానికి ఉద్యోగుల్ని ఒప్పించాలని చర్చల్లో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలకు సూచించింది.
సీపీఎస్ స్ధానంలో జీపీఎస్
సీఎం వైఎస్ జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుకు ఉద్యోగులు పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జీపీఎస్ పేరుతో కొత్త పింఛన్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చల్లోనూ జీపీఎస్ అమలుకే మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. తద్వారా సీపీఎస్ కు బదులుగా జీపీఎస్ అమలవుతుందని మంత్రులు ఉద్యోగ నేతలకు స్పష్టత ఇచ్చారు.
పాత విధానానికి న్యాయ సమస్యలు
ఉద్యోగ నేతలతో జరిపిన చర్చల్లో గతంలో అమలు చేసిన పింఛన్ విధానాన్ని సీపీఎస్ స్ధానంలో అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ససేమిరా అంది. దీంతో సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో చర్చలు ఎలాంటి కొత్త ఫలితాన్నీ ఇవ్వలేదు. పాత పింఛన్ విధానం అమలు సాధ్యం కాదని మంత్రుల కమిటీ చెప్పేసింది. పాత పింఛన్ విధానం అమలు చేస్తే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని మంత్రులు పేర్కొన్నారు.
ఉద్యోగులకు నచ్చజెప్పాలని సూచన
జీపీఎస్ విధానం అమలుకు ఉద్యోగుల సహకారం కావాలని ఉద్యోగసంఘాల నేతలతో జరిగిన చర్చల్లో మంత్రులు సూచించారు. సీపీఎస్ ఉద్యోగులకు నచ్చజెప్పాలని ఉద్యోగ నేతలకు వారు సూచన చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ సంగాలు సీపీఎస్ రద్దుకు పట్టుబడుతున్న నేపథ్యంలో వారికి నచ్చజెప్పే బాధ్యతను తీసుకోవాలని ఉద్యోగ నేతలకు మంత్రులు సూచించారు. అయితే వారు ఏ మేరకు ఉద్యోగులకు నచ్చజెప్తారనే దానిపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
సర్కార్ పై ఉద్యోగ సంఘాల ఫైర్
జీపీఎస్పై ఆరు సంఘాల నేతలు ఇవాళ తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. జీపీఎస్లో సీపీఎస్లోని అవలక్షణాలన్నీ ఉన్నాయని ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీకి తెలిపారు. జీపీఎస్ ప్రతిపాదనలు దారుణంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. రాజస్థాన్లో 4 లక్షల ఉద్యోగులను ఓపీఎస్లోకి తెచ్చారని ఉద్యోగ సంఘాలు గుర్తుచేశాయి.
అయితే ఇప్పటికే స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు రావని ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పగా.. ఎప్పటికైనా ఆ మొత్తం ఉద్యోగులదేనని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాలు వివరించాయి. జీపీఎస్లో ఇంకా ఏం కావాలో మాత్రమే చెప్పాలని మాత్రమే మంత్రుల కమిటీ కోరడంతో ఉద్యోగసంఘాలు నిరాశగా బయటికి వచ్చేశాయి.