సమగ్ర భూముల రీసర్వేలో జాప్యం వద్దు .. సమీక్షలో సీఎం జగన్
జాప్యం లేకుండా సమగ్ర భూముల రీసర్వే మొదలుపెట్టి, మూడు విడతల్లో సర్వే పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖలో భూముల రీసర్వేపై సీఎం జగన్ నేడు సమీక్షాసమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సర్వేలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
భూముల రీసర్వే చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అన్న సీఎం జగన్
సీఎం జగన్ మోహన్ రెడ్డి సమగ్ర భూముల రీసర్వే చాలా ముఖ్యమైన ప్రాజెక్టుగా భావించాలని,అన్ని మండలాల వారీగా సర్వే నిర్వహించాలని, సర్వే హద్దురాళ్ళ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక అంతేకాదు మనుషులకు ఆధార్ ఏ విధంగా గుర్తింపునిస్తుందో .. అలాగే భూములకు భూధార్ కూడా ఎప్పటికీ గుర్తింపు అని అధికారులు గుర్తుంచుకోవాలని అందుకే జాగ్రత్తగా రీ సర్వే చెయ్యాలని అన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చాలా జాగ్రత్తగా భూముల రీసర్వే నిర్వహించాలని సూచించారు.
సర్వేలో వివాదాలు వస్తే మొబైల్ కోర్టుల్లో పరిష్కరిస్తామని సీఎం జగన్ కు వివరించిన అధికారులు
ఇక సమగ్ర భూముల రీసర్వే కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను వారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించారు. సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే గ్రామ సచివాలయాల పరిధిలో మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. ఇక డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్ కోర్టులు నడుస్తాయని, వివాదాల పరిష్కారానికి సత్వర నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇక దీంతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సర్వే రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని వారు సీఎంకు వివరించారు .
సర్వే డేటా డిజిటలైజ్ చేస్తామన్న అధికారులు .. కార్స్ నెట్ వర్క్ పని విధానం జగన్ కు వివరణ
భూముల రీసర్వే కోసం వినియోగిస్తున్న కార్స్ నెట్ వర్క్ పని విధానాన్ని సీఎం జగన్ కు అధికారులు వివరించారు. ఇక సర్వే రికార్డులన్నింటినీ డిజిటల్ పద్ధతిలో భద్రపరుస్తామని , ఇక డిజిటల్ సమాచారాన్ని పూర్తిగా ఎన్ క్రిప్ట్ చేస్తామని రెవెన్యూ శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల భూముల విక్రయాలు, రిజిస్ట్రేషన్ ల ఆటో మ్యూటేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. ఇక ఈ డేటాను ఎవరూ మార్చకుండా మూడు,నాలుగు చోట్ల భద్రపరుస్తామని వారు పేర్కొన్నారు. ఇక సీఎం జగన్ మాత్రం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమగ్ర భూముల రీ సర్వేను త్వరితగతిన పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు.