వివక్ష ఉండదు: వెంకయ్య, యుపిఏ వల్లే సమస్యలని..
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు. విశ్వసనీయత లేకనే కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల్లో ఓటమి పాలైందని ఆయన అన్నారు.
దుగరాజపట్నాన్ని మేజర్ పోర్టుగా అభివృద్ధి చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకురావడమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఆరు నెలల్లో విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులను ఫీల్డ్ మీదికి తీసుకొస్తామన్నారు. విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రాయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు.

ఆంధ్రాలో రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు జాతీయ రహదారి నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణలో ఎన్టిపిసిని విస్తరిస్తామన్నారు. తెలంగాణలో రైల్వే ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ- గుంటూరు-తెనాలి మధ్య మెట్రో రైలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఖమ్మం, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై అధ్యయనం జరగాలని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని, ప్రత్యేక హోదాలాంటి సమస్యలున్నాయని అన్నారు. విభజనపై మూడేళ్ల క్రితమే యూపిఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనివుంటే బాగుండేదని, ఇన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యేవి కావని అన్నారు. విభజన బిల్లు రూపకల్పనే సక్రమంగా సాగలేదని ఆరోపించారు. విభజనపై ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం లేఖ రాశారని చెప్పారు. యూపిఏ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రస్తుత సమస్యలకు కారణమని వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications