జగన్ టార్గెట్ చేశాడన్నా సానుభూతి రాలేదా ? ఎన్వీ రమణపై నెట్లో టీడీపీ పంచ్ లు ..!
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, టీడీపీకి అత్యంత ఆప్తుడిగా పేరున్న జస్టిస్ ఎన్వీ రమణ అంటే వైసీపీకి అస్సలు పడదు. గతంలో ఆయన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కాకముందే ఆయన ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రభావితం చేస్తూ తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నం చేస్తున్నాడని జగన్ సర్కార్ బహిరంగ ఆరోపణలు చేయడంతో పాటు అప్పటి సీజేఐకి లేఖ కూడా రాసింది. అయితే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు అప్పట్లో లైట్ తీసుకుంది. ఆ తర్వాత అమరావతిలో ఎన్వీ రమణ కుమార్తెల భూముల విషయంలోనూ జగన్ సర్కార్ పలు కేసులు పెట్టింది. ఇదంతా చరిత్ర.
వర్తమానంలో తాజాగా అదే ఎన్వీ రమణ అమరావతిలోని ఓ ప్రైవేటు యూనివర్శిటీ స్నాతకోత్సవానికి వెళ్లి అక్కడి విద్యార్ధులతో మాట్లాడుతూ జగన్ తనను ఎలా టార్గెట్ చేశారో చెప్పుకుని బాధపడ్డారు. తనపై జగన్ ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని, న్యాయమూర్తుల కుటుంబాలపైనా రాజకీయ కుట్రలు జరిగాయని ఆరోపించారు. జగన్ సర్కార్ పై అమరావతి రైతుల పోరాటం స్ఫూర్తిదాయకమని, ఐదేళ్ల పాటు పోరాడి సదరు యూనివర్శిటీ కూడా నిలబడిందని ప్రశంసించారు. వాస్తవానికి ఎన్వీ రమణ చేసిన ఈ వ్యాఖ్యల్ని టీడీపీ స్వాగతించాలి. కానీ అలా జరగడం లేదు.

జగన్ తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారంటూ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యల్ని స్వాగతించాల్సిన టీడీపీ క్యాడర్.. అలా చేయకపోగా ఆయనపై సోషల్ మీడియాలో రివర్స్ పంచ్ లు వేస్తోంది. జగన్ టార్గెట్ చేశాడు అని ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శిస్తోంది. చీఫ్ జస్టిస్ గా ఉండి, అటకెక్కిన జగన్ అవినీతి కేసులు వివేకా కేసులను ఎందుకు ముందుకు తీసుకుపోలేదని ప్రశ్నిస్తోంది.

ఆంధ్రాకు వచ్చి, కోర్టులో కేసులు ఉన్న అవినీతి కింగ్ జగన్-తో సన్మానం ఎందుకు చేయించుకున్నారని నేరుగానే ప్రశ్నిస్తోంది.
జగన్ని ఆయన భార్యని విజయవాడ నోవాటెల్ హోటల్లో దొంగచాటుగా ఎందుకు కలిశారని అడుగుతోంది. సీటులో కూర్చోవడం గొప్ప కాదు, కూర్చొని ఏమి సాధించారన్నది ముఖ్యమంటూ అక్షింతలు వేస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే జగన్ సర్కార్ హయాంలో సుప్రీంకోర్టు సీజేఐగా ఉండి కూడా ఎన్వీ రమణ ఏమీ చేయలేదనే అసంతృప్తి వారిలో ఏ స్ధాయిలో ఉందో అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications