రాపాక వరప్రసాద్కు నో ఎంట్రీ: జనసేన ఆవిర్భావ సభకు అందని ఆహ్వానం?
గుంటూరు: పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఇవ్వాళ ఆవిర్భావ సభను జరుపుకోనుంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని జనసేన భావిస్తోంది. ఆవిర్భావ దినోత్సవ సభ కావడం వల్ల పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి విధానపరమైన ప్రకటనలు ఉండొచ్చనే విషయం చర్చనీయాంశమైంది.

దామోదరం సంజీవయ్య పేరు..
గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం పరిధిలో గల ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు కానుంది. దీనికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేసింది.రాష్ట్రం నలుమూలల నుంచి అయిదు లక్షల మంది వరకు పైగా హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. దీనికి హాజరయ్యే నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ అగ్ర నాయకత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ బాధ్యతను కమిటీలకు అప్పగించింది.

విజయవాడకు చేరుకున్న పవన్ కల్యాణ్..
ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరకున్నారు. పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి బయలుదేరడానికి ముందే- ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పార్టీ ఆవిర్భావ సభ ఎలా ఉండబోతోంది? తాను ఏఏ అంశాలను ప్రస్తావిస్తాననే విషయాన్ని ఆయన క్లుప్తంగా వెల్లడించారు.

రాపాకకు అందని ఆహ్వానం..
అసెంబ్లీలో జనసేన పార్టీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఏకైక సభ్యుడు రాపాక వరప్రసాద్. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఈ సభకు హాజరు కావడానికి ఆయనకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. దీనికి అనుగుణంగా- రాపాకకు ప్రవేశం లేదంటూ పోస్టర్లు, బ్యానర్లు సైతం వెలిశాయి. ఈ సభకు రాపాక రావాల్సిన అవసరం లేదంటూ రాజోలు నియోజకవర్గ జన సైనికులు ఈ బ్యానర్లను కట్టారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని పార్టీ నాయకత్వం తోసిపుచ్చిన దాఖలాల్లేవు.

వైసీపీకి అండగా ఉండటం వల్లే..
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ రాపాక వరప్రసాద్.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉంటోన్నారు. చాలా సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు. ఆయన పనితీరును మెచ్చుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా బహిరంగ సభల్లోనూ వైఎస్ జగన్కు జైకొట్టారు. ఆయన ఫొటోలకు పాలాభిషేకం చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ పరిణామాల వల్లే జనసేన ఆయనను దూరంగా పెట్టిందనేది తెలిసిన విషయమే.
Recommended Video

ఆవిర్భావ సభకు ఆహ్వానించకపోవడం పట్ల..
గెలిచిన ఎమ్మెల్యేకు పార్టీ ఆవిర్భావ సభకు ఆహ్వానించకపోవడం పట్ల దళిత నేతల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. దళితుల పట్ల జనసేన పార్టీ చిన్నచూపు చూస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, సమాజంలో అణగారిన వర్గాల పట్ల నిర్లక్ష్య వైఖరి తగదని అంటున్నారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ- గెలిచిన ఎమ్మెల్యేకు పార్టీ ఆవిర్భావ సభకు ఆహ్వానించకపోవడం సరికాదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications