మాఫీ చేస్తాం, కానీ: పుల్లారావు తిరకాసు, కిషన్ ఆగ్రహం
హైదరాబాద్: ఆర్బీఐ వద్దన్నప్పటికీ తాము రుణమాఫీ చేస్తామని, ప్రస్తుతానికి స్థోమత ఉన్న రైతులు రుణాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం అన్నారు. స్థోమత ఉన్న రైతులు ఇప్పుడు రుణాలు చెల్లిస్తే, వారికి తర్వాత తిరిగి తాము చెల్లిస్తామన్నారు. రెండు నెలల్లో రుణమాఫీ చేస్తామన్నారు. ఆర్థిక వనరుల పైన దృష్టి సారిస్తామన్నారు.
ఎలా చేస్తారో చెప్పాలి: రామచంద్రయ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణమాఫీ ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య అన్నారు. ఏం చేసి అయినా.. రైతులు ప్రయివేటు అప్పులకు వెళ్లకుండా చూడాలని కోరారు.
బాబు ఆస్తులు చాలు: చెవిరెడ్డి
రుణమాఫీకి చంద్రబాబు ఆస్తులు తనఖా పెడితే చాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి విమర్శించారు. బాబు ఆస్తులు తనఖా పెడితే రుణమాఫీతో పాటు పింఛన్లు కూడా ఇవ్వవచ్చునన్నారు. బాబు హయాంలో ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయని, ప్రయివేటు సంస్థలు మాత్రమే బాగుపడ్డాయన్నారు. చిత్తూరు డెయిరీని మూతబడేలా చేసిన చంద్రబాబు తన హెరిటేజ్ను మాత్రం లాభాల్లో నడుపుతున్నారన్నారు.
ఆగస్టు 15లోగా: రామకృష్ణ
ఆగస్టు పదిహేనవ తేదీలోగా రుణమాఫీ చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. లేదంటే తాము కలెక్టరేట్లు, బ్యాంకుల వద్ద ఆందోళన చేస్తామన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ పైన సుప్రీం కోర్టు తీర్పు కేసీఆర్కు చెంప పెట్టు అన్నారు. స్థానికత నిర్ణయించేందుకు చట్టాలు ఉన్నాయని చెప్పారు.
గోల్కొండ కోటపై దేనికి ప్రతీక: కిషన్ రెడ్డి
నియంతృత్వానికి, అణచివేతకు కేంద్రంగా నిలిచిన గోల్కొండ కోట పైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం దేనికి ప్రతీక అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినం నిర్వహించాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలివ్వాలన్నారు.
ఈ నెల 21వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హైదరాబాదుకు వస్తున్నారని చెప్పారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. విద్యుత్ కోతలకు నిరసన తెలిపిన రైతుల పైన కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయించడం అన్యాయమన్నారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై అవగాహన లేదన్నారు. అందుకే వితండ వాదం చేస్తోందన్నారు. జిల్లా కేంద్రాలను లండన్, న్యూయార్క్లా చేస్తామంటున్న కేసీఆర్ రైతుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదన్నారు.