పోలవరంతో టికి నష్టం లేదు: బాబు, మద్దతన్న జగన్
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం ప్రవేశపెట్టారు. పోలవరం ముంపు గ్రామాలు గతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో భాగంగా ఉండేవని, పాలనా సౌలభ్య కోసం వాటిని ఖమ్మం జిల్లాలో కలిపారని చంద్రబాబు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయడం జరిగిందని చెప్పారు. అనాటి యూపిఏ ప్రభుత్వం పలు ముంపు గ్రామాలను ఏపికి ఇచ్చిందని తెలిపారు. అయితే వాటిని అమలు చేసే లోపే ఎన్నికలు రావడంతో ఆ ఆర్డినెన్స్ ఆగిపోయిందని, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో ఆ ఆర్డినెన్స్ను అమలు చేయడం జరుగుతోందిన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముంపు గ్రామాలను ఏపిలో కలపకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు.
తెలుగువారు కలిసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పోలవరం వల్ల గోదావరి, కృష్ణా డెల్టాలకు నీరు అందుతుందని చంద్రబాబు తెలిపారు. ఐదున్నర జిల్లాలకు నీరు అందుతుందని చెప్పారు. ఏపిలో కరెంటు ఎక్కువ వస్తే తెలంగాణ ప్రాంతానికి అందిస్తామని ఆయన అన్నారు. ఇలాంటి ఉపయోగకర ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని అన్నారు. వచ్చే పార్లమెంటు సెషన్స్లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని మూడేళ్లలో పూర్తి చేయాలని అన్నారు. కేంద్రం అమోదించిన విధంగానే ప్రాజెక్టును పూర్తి చేయాలని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పోలవరం తీర్మానానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే అక్కడి ప్రభుత్వం పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. విభజనలో ఏదైనా మంచి జరిగిందంటే అది పోలవరం ప్రాజెక్టు నిర్మాణమేనని అన్నారు. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలన్నారు. చంద్రబాబు చెప్పిన దానికి తాము ఏకీభవిస్తున్నామని అన్నారు.
అంతకుముందు సభలో హిమాచల్ప్రదేశ్ లోని బియాస్ నదిలో మృతి చెందిన తెలుగు విద్యార్థులకు సభ సంతాపం తెలిపింది. విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని చంద్రబాబు నాయుడు అన్నారు. వారికి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. సభలో 2 నిమిషాలు మౌనం పాటించారు. అంతరం ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సంతాపం తెలిపారు. చిన్న వయస్సులో ఎవరెస్ట్ అధిరోహించిన తెలంగాణ విద్యార్థులు మాలవత్ పూర్ణ, సాదుల ఆనంద్లను అభినందిస్తూ చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. వారికి అభినందనలు తెలిపారు. విద్యార్థుల స్ఫూర్తి ఆదర్శమని చెప్పారు. వారు తెలుగువారైనందుకు గర్వపడాలని అన్నారు.
కాగా, ఏం రెసల్యూషన్ ఇస్తున్నారో తెలియడం లేదని వైయస్ జగన్ అన్నారు. దయ ఉంచి తమకు దానికి సంబంధించిన కమ్యూనికేషన్ ఉండాల్సిందిగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకు స్పందించిన మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. బిఏసికి రానందు వల్లే మీకు కమ్యూనికేషన్ అందలేదని చెప్పారు. బిఏసి రావాలని తమకూ ఉందని జగన్ అన్నారు.
సభలో రెండే పక్షాలు ఉన్నప్పటికీ.. ప్రతిపక్షం వాయిస్ లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది ప్రిసైడెన్స్ కు నాంది పలుకుతోందని అన్నారు. మీరు ఇవ్వాళ అధికారంలో ఉండోచ్చు.. రేపు మేం అధికారంలోకి రావొచ్చు.. కానీ మనం రాబోయే రోజులవారికి ఆదర్శంగా ఉండాలని జగన్ సూచించారు. సభకు ఒక్కటే రోజు ఉన్నందున సమాచారం అందించలేకపోయామని యనమల అన్నారు.












Click it and Unblock the Notifications