చెప్పండి, మేం అవసరం లేదు: డిగ్గీ, జగన్ దారిలో బాబు
విభజనపై సిడబ్ల్యూసి తీర్మానం చేసినందున పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. తమ పార్టీ నేతలు జివోఎంను కలిసి నివేదిక ఇవ్వవల్సిన అవసరం లేదన్నారు. తాము మూడు నెలల క్రితమే విభజనపై తీర్మానం చేసినట్లు చెప్పారు. అయినా కాంగ్రెసు నివేదిక ఇస్తుందని చెప్పారు. మిగిలిన పార్టీలు రేపటిలోగా అభిప్రాయం చెప్పాలన్నారు.
అందరిని సంప్రదించాకే తెలంగాణపై తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన డిమాండ్లను జివోఎంకు సూచించవచ్చునన్నారు. జివోఎంకు అందరు తమ అభిప్రాయాలు చెప్పవచ్చునని, పార్టీల పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను చెప్పవచ్చునని తెలిపారు.
జివోఎం: జగన్ దారిలో చంద్రబాబు
జివోఎం విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాట పట్టారు! జివోఎంకు లేఖపై స్పందించకూడదని టిడిపి నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి చంద్రబాబు ప్రధానమంత్రికి లేఖ రాసే యోచనలో ఉన్నారు.
జివోఎంను తాము గుర్తించడం లేదని, క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తే తప్ప సమస్యలు అర్థం కావని, ఈ మెయిళ్ల ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆయన లేఖలో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. లేఖపై చర్చించేందుకు ఇరు ప్రాంతాల నేతలు చంద్రబాబుతో భేటీ కానున్నారు.