'మాదిగ యాత్రకు అనుమతి లేదు': 'నారావారిపల్లెకు వస్తే అడ్డుకుంటారా?'
విజయవాడ: ఈ నెల 10న చిత్తూరు జిల్లాలో మందకృష్ణ మాదిగ తలపెట్టిన 'మాదిగ రథయాత్ర'కు ఏపీ ప్రభుత్వం అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఘాటు వ్యాఖ్యలతో లేఖ రాశారు.
తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీనే తాము అడుగుతున్నామని అందులో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని ఓడించడానికి యత్నించిన మాలమహానాడు నేతలకు పదవులు కట్టబెడుతున్నారని, ఇది న్యాయమా అని ప్రశ్నించారు.
పోలీసులతో పాటు రాష్ట్ర మంత్రి ఒకరు నారావారిపల్లెలో తాము తలపెట్టిన యాత్రపై దాడి చేయాలని చెబుతున్నారని ఆరోపించారు. నారావారిపల్లెలో మీ తల్లిదండ్రుల దగ్గరి నుంచి యాత్ర చేపడితే మీకు తెలుస్తుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి యాత్రను చేపట్టనిట్లు ఆయన పేర్కొన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భోజనం చేస్తే తప్పులేదు కానీ మేం నారావారిపల్లెకు వస్తే అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. తమను నిర్బంధించినా పోరాటాన్ని ఆపేది లేదంటూ ఆ లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు మందకృష్ణ తలపెట్టిన మాదిగ రథయాత్రకు అనుమతి లేదని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ వెల్లడించారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగపై చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది మాదిగలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా మందకృష్ణ మాదిగ యాత్రకు అనుమతిని నిరాకరించినట్టు చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ కోసం కాగా, ఈ నెల 10న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె నుంచి మందకృష్ణ మాదిగ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే.