Raghurama krishnam Rajuకు షాక్ :హైకోర్టులో రెబల్ ఎంపీకి దక్కని ఊరట.. పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం
అమరావతి: హైకోర్టులో రఘురామకృష్ణం రాజుకు ఊరట లభించలేదు. శుక్రవారం అరెస్టయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విచారణ చేసిన హైకోర్టు పిటిషన్ను కొట్టేసింది. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దూషించాడని పేర్కొంటూ శుక్రవారం సాయంత్రం ఆయన్ను ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాదులోని అతని నివాసం నుంచి అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. అయితే తన అరెస్టు అక్రమం అని ఏపీ ప్రజల తరపునే తాను ప్రశ్నిస్తున్నందు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొంటూ ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఈ పిటిషన్ను న్యాయస్థానం విచారణ చేసింది.
వాదనలు ఇలా జరిగాయి
రఘురామకృష్ణం రాజు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. విచారణ లేకుండా అరెస్టు ఎలా చేస్తారని ఆదినారాయణరావు వాదించారు. అరెస్టుకు సహేతుకమైన కారణాలు లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కోర్టుకు తెలిపారు న్యాయవాది ఆదినారాయణ రావు. ముందుగా కింది కోర్టును ఆశ్రయించాలని ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించాలని కోర్టు సూచిస్తూ రఘురామ దాఖలు చేసిన హౌజ్ మోషన్ పిటిషన్ను కొట్టేసింది.
అంతకుముందు ఏం జరిగింది
అంతకుముందు ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై రఘరామకృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో తాము సుమోటో కేసు నమోదు చేసినట్లు సీఐడీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గౌరవ ఎంపీ తన వ్యాఖ్యలు, హావభావాల ద్వారా ప్రజల్లో విద్వేషభావం నింపేలా ప్రవర్తించారని, ప్రజల్లో హింస ప్రజర్విల్లేలా వ్యవహరించారని పేర్కొంది. రెడ్డి, క్రిస్టియన్ సామాజిక వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని, వారికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారని తెలిపింది. తద్వారా ఆయా వర్గాల మధ్య చిచ్చు రేపి ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్ర చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇక ఎఫ్ఐఆర్లో ఏ1గా రఘురామకృష్ణం రాజు పేరును చేర్చగా ఏ2గా రెండు మీడియా ఛానెల్స్ను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ రెండు ఛానెల్స్ రఘురామకృష్ణం రాజుతో కలిసి కుట్రచేశాయనే అభియోగాన్ని సీఐడీ ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది.
Recommended Video
పార్లమెంటు సభ్యుడికి తగు సదుపాయాలు
తన అరెస్టుపై రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకూ మెజిస్ట్ర్టేట్ ముందు ఆయన్ను హాజరుపరచవద్దని సీఐడీకి సూచించింది. పోలీసు కస్టడీలో ఉన్న పార్లమెంటు సభ్యుడికి తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఆహారం, వైద్యంతో పాటు వసతికితగిన వెసులుబాటు ఇవ్వాలని సీఐడీకి ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. తిరిగి మధ్యాహ్నం మరోసారి ఈ కేసుపై హైకోర్టు విచారణ జరిపి సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని చెబుతూ రఘురామ పిటిషన్ను కొట్టేసింది.