బాబుకు లభించని ఊరట: హోదాపై ఆరని చిచ్చు, పవన్ కళ్యాణ్ ఎటో..
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించినట్లు లేదు. ప్రధాని మోడీతోనే కాకుండా ఆయన కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలతో సమావేశమయ్యారు. ఎపికి కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి మాట్లాడారు. కానీ, ప్రత్యేక హోదాపై ఆయన రాజీ పడినట్లే కనిపించారు.
ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవిని కాదని, అది ప్రధాని మోడీ చేతుల్లోనే ఉందని, తాను ఏమీ చేయలేనని చంద్రబాబు కాస్తా స్పష్టంగానే చెప్పారు. హోదా ఇవ్వలేమనే విషయాన్ని అరుణ్ జేట్లీ మీడియా సమావేశంలో తేల్చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని మోడీ చెప్పినట్లు సమాచారం. హామీ ఇచ్చినదానికన్నా ఎక్కువే ఇస్తామని జైట్లీ చెప్పారు.
తాను మోడీతో చర్చించిన విషయాలను, తమకు అందాల్సిన సహాయం, కేంద్రం ఇవ్వజూపిన సాయం గురించి చంద్రబాబు మీడియా సమావేశంలో సుదీర్ఘంగానే మాట్లాడారు. ప్రత్యేక హోదా వల్ల పొందే ప్రయోజనం కన్నా ఎక్కువ ప్రయోజనం పొందే ప్యాకేజీని రాబడుతామని కూడా ఆయన చెప్పారు. అయినా ఆంధ్రప్రదేశ్ చల్లబడేట్లు కనిపించడం లేదు.
ప్రత్యేక హోదా సాధనకు పోరాటం చేయడానికి విద్యార్థి జెఎసి ముందుకు వచ్చింది. మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ప్రళయం సృష్టించి అయినా సరే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడ్డారని ఆయన విమర్శించారు.
ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ నెల 29వ తేదీన రాష్ట్ర బంద్ను తలపెట్టింది. ఈ బంద్కు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ప్రత్యేక హోదాపై పోరాటానికి కూడా వామపక్షాలు కార్యాచరణను రూపొందించుకున్నాయి. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు పెచ్చరిల్లే పరిస్థితి కనిపిస్తోంది.
కాగా, చిన్న చిన్న విషయాలపై కాకుండా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని కారెం శివాజీ అన్నారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారనేది కూడా ఆసక్తిగానే ఉంది. రాజధానికి భూసేకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై కయ్యానికి కాలు దువ్వుతున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ముందుకు రాకపోవచ్చునని అంటున్నారు.
ప్రత్యేక హోదా విషయాన్ని చంద్రబాబు కూడా కేంద్రం మీదికి నెట్టే ప్రయత్నం చేయవచ్చు. తన చేతుల్లో లేదని చెప్పడం ద్వారా ఆయన దాదాపుగా అదే పని చేసినట్లు కనిపిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించడానికి పోరాటానికి దిగితే అది బిజెపిపైనే అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అందుకు సిద్ధపడుతారా అనేది అనుమానంగా ఉంది.
కాగా, చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి వైయస్ జగన్ ప్రత్యేక హోదా కోసం జరిపే పోరాటాన్ని సాగిస్తుండగా, బిజెపి పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నారనే విమర్శ ఉంది. వామపక్షాలు మాత్రం బిజెపి, టిడిపిలను లక్ష్యం చేసుకుని ఆందోళనలు చెపట్టే అవకాశం ఉంది. కాంగ్రెసు పార్టీ కూడా ఈ రెండు పార్టీలను లక్ష్యఁ చేసుకుని ఆందోళనలకు పదును పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.