లక్ష్మీ పార్వతికి అవమానం: లేని హోదా ఇచ్చారు..అధికారుల తిరస్కరణ: దిద్దుబాటు చర్యలు ప్రారంభం..!
అమరావతి: ఎన్టీఆర్ సతీమణి..వైసీపీలో తొలి నుండి జగన్ కు మద్దతు నిలిచిన లక్ష్మీ పార్వతికి వైసీపీ ప్రభుత్వంలో అవమానం జరిగిందనే వార్తలు బయటకు వస్తున్నాయి. వైసీపీలో ఉంటూ చంద్రబాబు మీద నిత్యం విరుచుపడే లక్ష్మీపార్వతికి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత..అనేక తర్జన భర్జనల తరువాత నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. ఇక్కడే లక్ష్మీ పార్వతికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంతకీ లక్ష్మీ పార్వతికి ఎదురవుతున్న సమస్యలు ఏమిటి..?
తెలుగు అకాడెమీ ఛైర్పర్సన్గా లక్ష్మీపార్వతి
నందమూరి లక్ష్మీ పార్వతి స్వతహాగా రచయిత కావటంతో.. నామినేటెడ్ పోస్టులో భాగంగా తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ పదవిని ముఖ్యమంత్రి జగన్ కట్టబెట్టారు. అయితే, ఇది జరిగి మూడు నెలలవుతన్నా..అధికారులు మాత్రం కొర్రీ పెడుతున్నారు. అసలు ఆ హోదానే లేదంటూ తిరస్కరిస్తున్నారు. అనేక రోజులుగా దీని పైన తన స్థాయిలో చర్చలు చేసిన లక్ష్మీ పార్వతికి చివరకు ముఖ్యమంత్రికి తన సమస్య చేరవేసారు. దీంతో..ఇప్పుడు లక్ష్మీపార్వతి సమస్యపైన దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి.
లేని పోస్టు..మూడు నెలలుగా లేని జీతభత్యాలు..
తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీ పార్వతిని మూడు నెలల కిందట నియమించారు. కేబినెట్ హోదా కల్పించారు. హోదాకు తగిన విధంగా జీత..భత్యాలను ఖరారు చేసారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి లక్ష్మీపార్వతికి రూపాయి కూడా అందలేదు. మూడు నెలలుగా జీతం సైతం ఇవ్వటం లేదు. ఈ విషయం పైన ప్రభుత్వంలోని ముఖ్యులతో లక్ష్మీ పార్వతి చర్చించటంతో.. ఆమెకు జీతం ఇవ్వాలని సూచిస్తూ సాధారణ పరిపాలన శాఖ విద్యా శాఖకు ఫైల్ పంపింది. అయితే, తెలుగు అకాడమీ విభజన చట్టం షెడ్యూల్ 10లో ఉంది. అకాడమీ విభజన ఇంకా జరగలేదు. ఈ నేపత్యంలో తమ శాఖ పరిధిలోనే కాదు.. రాష్ట్రంలోని లేని ఛైర్ పర్సన్ కు వేతనం ఇవ్వలేమని ఉన్నత విద్యా శాఖ తెగేసి చెప్పింది.
Recommended Video
దిద్దుబాటు చర్యలు ప్రారంభం..
అయితే, లక్ష్మీ పార్వతికి లేని హోదా కల్పించారా అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో మొదలైంది. నేరుగా ముఖ్యమంత్రి నామినేట్ చేసి..కేబినెట్ హోదా కల్పించిన వ్యక్తికి వేతనాలు నిలుపుదల చేయటమే ఈ చర్చ కు కారణమైంది. అసలు..ఆ పోస్టు లేకుండా ఎలా ఇచ్చారనేదే అసలు ప్రశ్న. ఇది బయటకు రావటంతో..ఇప్పుడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. సాధారణ పరిపాలన శాఖ తన బడ్జెట్ నుండి లక్ష్మీ పార్వతికి జీత భత్యాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. తెలుగు అకాడమీని సొసైటీస్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసే పనులు జరుగుతున్నాయని.. అప్పటి వరకు తామే జీత భత్యాలు ఇస్తామని జీవోలో స్పష్టం చేసారు. ఈ రకమైన నిర్ణయం సైతం సరైనదేనా అంటూ ఉన్నతాధికారుల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి దీనిని మాత్రం బయటకు చెప్పలేకపోయినా.. లక్ష్మీ పార్వతి మాత్రం అవమానరకంగా భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.