మా విచారణలో ఏం తేలిందంటే...దుర్గ గుడి తాంత్రిక పూజలపై ఎంక్వైరీ
విజయవాడ: విజయవాడ దుర్గ గుడిలో అర్ధరాత్రి పూజలపై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ఆరంభించింది. శుక్రవారం దుర్గ గుడిలో 40 ఈ కమిటీ మందిని విచారించింది. ప్రాధమిక విచారణలో దుర్గ గుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదనే అంచనాకు నిజనిర్థారణ కమిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
కనక దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయా? లేదా? అనే విషయంపై అసలు వాస్తవాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఒక నిజ నిర్ధారణ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో సభ్యులైన దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రఘునాథ్, ఆగమశాస్త్ర పండితుడు చిర్రావుల శ్రీరామశర్మ శుక్రవారం దుర్గగుడికి వచ్చి అన్ని కోణాల్లోనూ విచారణ ప్రారంభించారు. తొలుత అందుబాటులో ఉన్న40మందిని విచారించారు. వీరిలో కొందరి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆలయ సంప్రదాయాలకు భిన్నంగా ఏమైనా జరిగిందా? అనే అంశంపై దృష్టి సారించారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. వీటన్నింటినీ విశ్లేషించి రూపొందించే నివేదికను శనివారం ప్రభుత్వానికి అందజేయనున్నారు.

జరిగాయా? లేదా?...
కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయా? లేదా అనే విషయాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగిన నిజనిర్థారణ కమిటికి
ఆలయంలో ఎలాంటి పూజలు జరగలేదని వైదిక కమిటీ తరఫున స్థానాచార్యులు శివప్రసాదశర్మ, శంకర శాండిల్య కమిటీకి నివేదించినట్లు తెలిసింది. వివాదంలో కీలకంగా ఉన్న ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్బాబును రెండు గంటలకుపైగా విచారించారు. వైదికపరంగా ఆయన విద్యార్హతలు తెలుసుకోవడంతో పాటు పూజా విధానాలను, మంత్రాలను బద్రీనాథ్బాబుతో వల్లె వేయించినట్ల తెలుస్తోంది.

అసలు...ఆరోజు... ఏంజరిగింది....
వివాదానికి అవకాశమిచ్చిన డిసెంబర్ 26వ తేదీన ఏం జరిగిందనే విషయంపై బద్రీనాథ్బాబుతో పాటు ఉన్న ముగ్గురు అర్చకులను కూడా విచారించారు. వారితోనూ మంత్రాలు చెప్పించారు. ఆలయం నిత్యం మూసే సమయం కంటే అదనంగా ఎంతసేపు ఉంచారు? ఎందుకు ఉంచారు? అనే వివరాలు తెలుసుకుని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆరోజు విధుల్లో ఉన్న అసిస్టెంట్ ఈవో తిరుమలరావు, సూపరింటెండెంట్ గోపి, ఇన్స్పెక్టర్ మధుల వివరణ తీసుకున్నారు. పార్థసారథి అనే అపరిచిత వ్యక్తి లోపలికి ఎలా వచ్చాడు? అని ప్రశ్నించినట్టు సమాచారం. తర్వాత ఆలయ ప్రధాన భద్రత అధికారి, ఎస్పీఎఫ్ సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. ఆలయ రికార్డులను పరిశీలించారు. పాలనపరమైన అంశాలపై రఘునాథ్ దృష్టిపెట్టారు.

ఈవోతో మాట్లాడిన కమిటి....
విచారణ ప్రారంభానికి ముందే ఈవో సూర్యకుమారితో నిజనిర్థారణ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఆలయంలో అంతర్గతంగా అప్పటివరకు నిర్వహించిన విచారణ నివేదికలను ఈవో కమిటీకి అందజేశారు. విచారణకు హాజరైన ఉద్యోగులు, అర్చకులు బయటకు వచ్చాక విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. అంతకుముందు దుర్గగుడి ప్రధాన అర్చకుడు బద్రినాథ్, ఆయన మేనల్లుడు పార్థసారధిని నిజనిర్ధారణ కమిటీ విచారించింది. బైటకు వచ్చిన అనంతరం ప్రధాన అర్చకుడు బద్రీనాథ్...కమిటీ విచారణ జరుపుతోందని...ఈ సమయంలో మేం మాట్లాడలేమని, కమిటీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామంటూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

విచారణ అనంతరం...కమిటీ ఏమందంటే...
విచారణ అనంతరం ఆగమశాస్త్ర పండితుడు శ్రీరామశర్మ మాట్లాడుతూ...వేదమంత్రాలు ఉన్నచోట తాంత్రిక శక్తులు పనిచేయవని అన్నారు. ఇంకా విచారణ చేయాల్సి ఉందని, అమ్మవారి అంతరాలయాన్ని కూడా పరిశీలించి రహస్య పూజల కోసం ఏవైనా మార్పులు జరిగాయా? అనేది కూడా పరిశీలించి నివేదికలో పొందుపరుస్తామని తెలిపారు. మరో సభ్యుడు రఘునాథ్ మాట్లాడుతూ ఆలయం మూసే ముందు ప్రతిరోజూ అమ్మవారికి చీరలను మార్చడం, దిష్టితీయడం వంటివి సాధారణంగా జరిగేవేనని వెల్లడించారు. తమ దృష్టికి వచ్చిన అంశాలన్నింటినీ విశ్లేషించి క్రోడీకరించి రూపొందించే నివేదికను శనివారం ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

పూజలు జరిగాయంటున్న...శైవ క్షేత్రం పీఠాధిపతి ...
మరోవైపు ఇంద్రకీలాద్రి పై తాంత్రిక పూజలు వాస్తవమేనని శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి అంటున్నారు. పలుకుబడి గల వారి ఒత్తిళ్లకు తలొగ్గి పూజలు చేశారని, అయితే అధికారుల పొంతనలేని మాటలతో ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రక్షాళన జరగాలని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications