గంగిరెడ్డి చెప్పాక ఎవరినైనా ప్రశ్నిస్తాం, చింటూకు ప్రాణహానీ.. విడ్డూరం: డిజిపి
చిత్తూరు/విజయవాడ: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో గంగిరెడ్డి ఇచ్చే సమాచారంతో ఎవరినైనా ప్రశ్నిస్తామని డిజిపి జేవీ రాముడు సోమవారం నాడు చెప్పారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. గంగిరెడ్డి నేరాలు నాలుగు జిల్లాల్లో విస్తరించాయని చెప్పారు.
గంగిరెడ్డిని తాము త్వరలో కస్టడీకి తీసుకుంటామని చెప్పారు. అతను ఇచ్చే సమాచారంతో ఎవరినైనా ప్రశ్నిస్తామని చెప్పారు. ఏవోబీ, గోదావరి ప్రాంతాల్లో నక్సలైట్ కార్యకలాపాలు పెరిగాయని చెప్పారు. అగ్రిగోల్డ్ పైన హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాఫ్తు చేస్తామని తెలిపారు.
అమరావతిలో కమిషనరేట్ నిర్మాణం పైన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని చెప్పారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో పోలీసింగ్ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి, మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో నిందితుడు చింటూలకు ప్రాణహానీ ఉందని చెప్పడం విడ్డూరమన్నారు.
అమరావతిని కమిషనరేట్గా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. హైదరాబాదులో ఇబ్బందులు ఎదురుకాకుండా ఫ్రీజోన్గా ఉండాలని ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. 500 మంది ఎస్సైలకు సైబర్ భద్రత పైన శిక్షణ ఇప్పిస్తామన్నారు. సైబర్ నేరాలను తీవ్ర నేరాలుగా పరిణమిస్తున్నాయన్నారు.
కాగా, అంతకుముందు తన క్యాంప్ కార్యాలయాన్ని జేవీ రాముడు ప్రారంభించారు. సీఎం విడిది కార్యాలయానికి సమీపంలోనే ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయానికి ఆనుకొని ఉన్న డిజిపి అధికారిక నివాసం రెండు నెలల కిందటే ఆరంభమైంది. ఆఫీసర్స్ క్లబ్ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చారు.
చింటూకు ఏడు రోజుల కస్టడీ
మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూను చిత్తూరు న్యాయస్థానం పోలీసుల కస్టడీకి ఇచ్చింది. ఏడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఇచ్చింది. దీంతో, పోలీసులు అతని నుంచి హత్య గురించిన విషయాలను రాబట్టనున్నారు.