ప్రత్యేక హోదా: అనైక్యతే చంద్రబాబు వరం, సమస్య పవన్ కళ్యాణ్తోనే..
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై పోరాటంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధ్యం కావడం లేదు. అది సాధ్యమయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. ప్రతిపక్షాల మధ్య అనైక్యత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రత్యేక హోదా విషయంలోనే కాకుండా రాజధానికి భుసేకరణ విషయంలోనూ అదే కనిపిస్తోంది.
అయితే, పార్టీ ఉండి, క్యాడర్ లేకుండా సమస్యలపై నిలదీస్తున్న పవన్ కళ్యాణ్ ఒక్కరే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమస్యగా కనిపిస్తున్నారు. సినీ నటుడు శివాజీ కూడా చాలా కాలంగా ప్రత్యేక హోదాపై ఆందోళనకు దిగుతున్నారు. అయితే ఆయనకు పార్టీ గానీ క్యాడర్ గానీ లేదు. కానీ ఆయన వెనక కొన్ని వర్గాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
బలవంతపు భూసేకరణపై కాస్తా గొంతు పెంచిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై పెద్దగా మాట్లాడడం లేదు. ఇది చంద్రబాబుకు ఇంకాస్తా ఊరట కలిగించే అంశం. కాగా, ప్రత్యేక హోదాపై మాత్రమే మాట్లాడుతూ రాజధానికి భూసేకరణపై గొంతెత్తని శివాజీకి చంద్రబాబు మద్దతు కూడా ఉందనే ప్రచారం సాగుతోంది.

పవన్ కళ్యాణ్ గానీ శివాజీ గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అంగీకరించే పరిస్థితి లేదు. ప్రధాన ప్రతిపక్షమైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి వచ్చే పార్టీలు వామపక్షాలు మాత్రమే. మిగతా పార్టీలేవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకు మద్దతు ఇచ్చే పరిస్తితి లేదు.
కాంగ్రెసు పార్టీ ఒంటరి పోరే చేస్తోంది. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, ఇటు వైయస్ జగన్మోహన్ రెడ్డిని రెండు వైపులా ఉతికేసి ముందుకు సాగాలనే ఎపి పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డికి మరో పార్టీ మద్దతు లేదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షాల మధ్య అనైక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ను బుజ్జగించే ధోరణీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడమే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమంగా మారింది. ఏమైనా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు రూపు దిద్దుకోవడం లేదు.












Click it and Unblock the Notifications