ఏపీ ఈఎస్ఐ స్కాంలో పట్టుబిగిస్తున్నఏసీబీ- అచ్చెన్నాయుడి విచారణలో కీలక ఆధారాలు...?
ఏపీలో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల స్కాంలో ఏసీబీ పట్టు బిగిస్తోంది. తొలి రోజు విచారణలో విజిలెన్స్ నివేదికలో లభించిన ఆధారాలను బట్టి మాజీ మంత్రి అచ్చెన్నాయడుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగా పలు వ్యక్తిగత అంశాలనూ వారు అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద టెలిహెల్త్ వ్యవహారమే కేంద్రంగా దర్యాప్తు సాగుతోందని అర్ధమవుతోంది.
విధ్వంసానికే జగన్ రెడ్డి జై.. ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది .. టీడీపీ విమర్శనాస్త్రాలు
ఈఎస్ఐ స్కాం విచారణ...
రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పకడ్బందీ ఆధారాలతో ఫిక్స్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా ఈ కుంభకోణంపై విజిలెన్స్ నివేదికలో చాలా అంశాలు ఉన్నప్పటికీ కేవలం టెలి హెల్త్ సంస్ధకు ఇచ్చిన కాంట్రాక్టులో అచ్చెన్నాయుడు పాత్ర చుట్టూ ఏసీబీ దృష్టిసారిస్తోంది. మిగతా అంశాలు డైరెక్టర్ల నిర్ణయాలే కావడంతో టెలిహెల్త్ వ్యవహారంలోనే అచ్చెన్నాయుడును ఏసీబీ ప్రశ్నిస్తోంది. తొలి రోజు విచారణలో అచ్చెన్నాయుడును ప్రశ్నించడం ద్వారా నుంచి కొన్ని కీలక ఆధారాలు సంపాదించినట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.
కొనుగోలు నాటికి మంత్రిగా లేను...
టెలి హెల్త్ సర్వీసెస్ వ్యవహారంలో ఓ కంపెనీని సిఫార్సు చేస్తూ మీరు సంతకం పెట్టారు కదా అని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా.. కొనుగోళ్లు జరిగినప్పుడు నేను మంత్రిగానే లేనని అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. అయితే మంత్రిగా ఓ కంపెనీకి మీరెలా సిఫార్సు చేస్తారని ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. కానీ సదరు కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చి కొనుగోళ్లు చేపట్టిన ఫైల్ తనవద్దకు రానే లేదని అచ్చెన్నాయుడు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో వైద్య పరికరాల కొనుగోళ్లు ఎలా ఉన్నాయో అధ్యయనం చేయాలని సూచిస్తూ మాత్రమే సంతకం పెట్టానన్నారు. దీంతో అచ్చెన్నాయుడు కావాలనే ఈ వ్యవహారాన్ని తెలివిగా దాటవేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
అంతా డైరెక్టర్లే చేశారంటూ...
కార్మిక మంత్రిగా ఉంటూ టెలి హెల్త్ సర్వీసెస్ సంస్ధకు కాంట్రాక్టు ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రశ్నించినప్పుడు అంతా డైరెక్టర్లే చేశారని, తనకెలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. లేఖపై మీ సంతకం ఉందని అడిగినప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారో అలాగే చేయమని చెప్పినట్లు జవాబిచ్చారు. తద్వారా టెలి హెల్త్ సర్వీసెస్ కు మిగతా రాష్ట్రాల్లో కాంట్రాక్టు ఇస్తే ఏపీలోనూ ఇవ్వమని తాను చెప్పినట్లు అచ్చెన్నాయుడు పరోక్షంగా అంగీకరించినట్లయింది. దీంతో ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడిని దోషిగా రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లభించినట్లయిందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.
Recommended Video
వేర్వేరు చోట్ల విచారణ...
ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు నిందితులైన డైరెక్టర్లను ఏసీబీ వ్యూహాత్మకంగా వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తోంది. అచ్చెన్నాయుడిని గుంటూరు జీజీహెచ్ లో విచారిస్తున్న ఏసీబీ అధికారులు. మరో ఐదుగురు నిందితులను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి విచారణ నిర్వహిస్తోంది. తద్వారా విచారణ సందర్భంగా వీరు ఎలాంటి వివరాలను పంచుకోకుండా చూడాలనేది ఏసీబీ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న నిందితులను మరో రెండు రోజుల పాటు విచారించి తిరిగి జైలు అధికారులకు అప్పగించనున్నారు.