ఏపీ మంత్రి ఉషా శ్రీచరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
అమరావతి: ఆంధప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్పై బుధవారం నాన్ బెయిల్ వారెంట్ జారీ అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 17న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అప్పటి తహసీల్దార్ డీవీ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు 188 సెక్షన్ కింద ఉషశ్రీ తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన విచారణ బుధవారం కళ్యాణదుర్గం కోర్టులో జరిగింది.
విచారణకు గైర్హజరు కావడంతో ఆమెతోపాటు ఏడుగురిపై కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుబాన్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
మాజీ మంత్రి నారాయణకు కోర్టులో ఊరట
ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్లో అవతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మాజీమంత్రి నారాయణపై సీఐడి కేసు నమోదు చేసింది. ఆ కేసులో సాక్షిగా విచారణకు రావాలంటూ.. 160 సీఆర్పీసీ నోటీసు ఇచ్చింది.
ఈ నోటీసులపై నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నారాయణ అనారోగ్యంతో ఉన్నారని.. ఇటీవల శస్త్రచికిత్స జరిగిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. 65 ఏళ్ల వయస్సులో సీఐడీ విచారణకు హాజరుకాలేరని వివరించారు. వాదనలు విన్న జడ్జీ.. నారాయణను హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో విచారించుకోవచ్చని సీఐడీకి స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.