ఆగని దందా... కరోనా బాధితుల పట్ల కనికరమే లేకుండా అంబులెన్సుల దోపిడీ
కరోనా బాధితులు అన్న కనికరమే లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో యధేచ్ఛగా అంబులెన్సుల దందా కొనసాగుతోంది. కరోనా పేషెంట్ ను ఆసుపత్రికి తరలించాలి అంటే ఇతర వాహనాలలో తరలించడానికి వీలు లేని పరిస్థితిలో అంబులెన్సులను బుక్ చేస్తున్నారు బాధితులు. అయితే ఇదే అదునుగా చూసుకున్న అంబులెన్స్ ల నిర్వాహకులు అడ్డంగా దోపిడీకి పాల్పడుతున్నారు.

కరోనా బాధితులను నిలువుదోపిడీ చేస్తున్న అంబులెన్స్ ల నిర్వాహకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దోపిడీ మరింత ఎక్కువగా ఉంది. ఒక కిలోమీటరు మేర ప్రయాణించి కరోనా బాధితులను ఆసుపత్రికి తరలించడానికి కనీసం మూడు వేల వరకు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. ఇక ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి తరలించాలంటే 20 వేల పైమాటే. నగరాల్లో అయితే ఆ రేటు 30 వేల పైమాటే. కనికరమే లేకుండా అంబులెన్సులు దోపిడీ కొనసాగుతుంది. ఆసుపత్రిలో మరణించిన కరోనా రోగిని, స్మశానానికి తీసుకు వెళ్లేందుకు సైతం భారీగా వసూలు చేస్తూ బాధిత కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

కరోనా రోగి మృతదేహం తరలింపుకు కూడా 10 వేల దాకా చార్జ్
ఆసుపత్రిలో మరణించిన కరోనా రోగి మృతదేహాన్ని స్మశానానికి తీసుకువెళ్లడానికి 5 వేల నుంచి 10 వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితులు ప్రస్తుత తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అంబులెన్సులపై ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఎక్కడా అమలు కావడం లేదు.ఇక సిండికేట్ గా వ్యవహరిస్తున్న ప్రైవేట్ అంబులెన్సుల నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుండి కరోనా వచ్చిన వారిని ఆసుపత్రులకు తరలించడానికి వేలల్లో వసూలు చేస్తున్నారు. రోజంతా ఖాళీగా కూర్చున్నా, ఒక కరోనా రోగిని తరలిస్తే చాలు అన్నట్టుగా ఉంది అంబులెన్స్ ల పనితీరు.

మానవత్వం లేకుండా యధేచ్చగా దోపిడీ చేస్తున్న అంబులెన్స్ ల నిర్వాహకులు
ఎవరైనా గట్టిగా అధిక ధరలపై ప్రశ్నిస్తే, మేము రాము అని తేల్చి చెప్పేస్తున్నారు. డబ్బు చెల్లించగలిగితే రండి లేకపోతే లేదు అని మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా హైదరాబాద్ లో చాలా ఆసుపత్రులకు అక్కడి నుండి బాధితులు తరలివస్తున్నారు. కేవలం అంబులెన్స్ కే వారు దాదాపు 50 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి.ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, ప్రజల ఆరోగ్య సంక్షోభాన్ని కూడా వ్యాపారం చేస్తున్నారు వైద్య సేవల రంగానికి సంబంధించి విభిన్న శాఖలవారు.

ప్రభుత్వం ధరలను ఫిక్స్ చేసి కఠినంగా అమలు చెయ్యాల్సిన పరిస్థితి
అందులో అంబులెన్స్ ల నిర్వాహకులు కూడా ఉన్నారు. అంబులెన్స్ ల పేరుతో ప్రజలను అడ్డంగా దోచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ప్రభుత్వం అంబులెన్సులలో ప్రయాణానికి నిర్దిష్ట ధరలను నిర్ధారిస్తూ ప్రకటన చేసినప్పటికీ వాటిని పట్టించుకునే నాథుడే లేడు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా చేస్తున్న దోపిడి కరోనా బాధితులకు కళ్ళవెంట నీళ్ళు తెప్పిస్తోంది. ఈ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించి, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.












Click it and Unblock the Notifications