ఇంకో రౌండ్: ఏపీలో 24 గంటల్లో భారీ వర్షాలు: 10వ తేదీ వరకూ పడే ఛాన్స్?
విశాఖపట్నం: రాష్ట్రంలో మరో విడత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళల్లో వచ్చే 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి నైరుతి రుతు పవనాలు తిరోగమిస్తున్నాయని, అయినప్పటికీ.. చురుగ్గా కదులుతుండటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.

సీమలో భారీ వర్షాలకు ఛాన్స్
రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు స్థాయి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. రిసే అవకాశం ఉందని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడొచ్చని అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి, అనంతపురం జిల్లా గుంతకల్లులో 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైందని అన్నారు. ఏపీ, తెలంగాణలతో పాటు ఒడిశా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, పశ్చిమబెంగాల్, అసోంలకు వర్ష సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

అన్ని జిల్లాల్లో ఓ మోస్తరుగా..
కర్ణాటక దక్షిణ ప్రాంతం, తమిళనాడు, కేరళ ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడటం కూడా వర్షపాతానికి ఓ కారణమౌతున్నాయని అన్నారు. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, నైరుతి రుతు పవనాల కదలికలకు బంగాళాఖాతం వాయవ్య దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తోడైందని వెల్లడించారు.
రానున్న 24 గంటలలో వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలలో మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు.

సమృద్ధిగా..
ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. ఏ వర్షాకాల సీజన్ లో అయినా కనిష్టంగా కూడా వర్షపాతాన్ని చవి చూడని అనంతపురం వంటి జిల్లాల్లో ఈ సారి సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జిల్లాలోనే అతి పెద్దవైన ధర్మవరం, శింగనమల చెరువులు నిండిపోయాయి. పుట్టపర్తి సమీపంలోని బుక్కపట్నం అలుగు పారుతోంది. జిల్లాలోని అన్ని చెరువులూ దాదాపు జలకళను సంతరించుకున్నాయి. గుంతకల్లులో గురువారం భారీ వర్షం కురిసింది. చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కడప, కర్నూలు జిల్లాల్లో వర్షం కురవని ప్రాంతం అంటూ ఏదీ లేదు.

తగ్గని కుందూనది ఉధృతి..
కడప, కర్నూలు జిల్లాల్లో కుందూనది ఏ స్థాయిలో ప్రవహిస్తున్నదో తెలుసు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరద ఉధృతిని నమోదు చేసింది కుందూనది. కడప జిల్లాలోని మైలవరం రిజర్వాయర్ గేట్లు ఈ సీజన్ లో రెండోసారి ఎత్తేశారు. చిత్రావతిపై నిర్మించిన గండికోట, పెన్నాపై కట్టిన మైలవరం రిజర్వాయర్లలో చాలాకాలం తరువాత వరద జలాలు గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరువయ్యాయి. ఫలితంగా ఈ రెండు రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద జలాలను దిగువకు వదిలి వేస్తున్నారు. ఫలితంగా- పెన్నానదిపై నెల్లూరు జిల్లాలో నిర్మించిన సోమశిల జలాశయం పూర్తిగా నిండిపోయింది.












Click it and Unblock the Notifications