ఏపీ అసెంబ్లీ డిజైన్ పై...నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో స్పీకర్ కోడెల భేటీ
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతన అసెంబ్లీ నిర్మాణంకోసం నార్మన్ ఫోస్టర్ సంస్థ వివిధ డిజైన్లను రూపొందించగా వీటిలో టవర్ ఆకృతిలో ఉన్న డిజైన్ను సిఎం చంద్రబాబు ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అసెంబ్లీ నిర్మాణం విషయమై చర్చించేందుకు నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు స్పీకర్ కోడెల శివప్రసాద్రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో శాశ్వత అసెంబ్లీ భవనం డిజైన్ తో పాటు అనుబంధ నిర్మాణాల విషయమై చర్చ జరిపి వాటికి తుది రూపు తీసుకొచ్చేందుకు కసరత్తు జరిపారు.ఈ సమావేశం వివరాలను స్పీకర్ కోడెల మీడియాకు తెలిపారు.
శాశ్వత చట్ట సభల డిజైన్లపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో తాను చర్చించినట్లు కోడెల వెల్లడించారు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సిబ్బందికి కావాల్సిన వసతిపై కూడా వారితో చర్చించినట్లు తెలిపారు. డిజైన్ల తుది రూపు విషయమై వారికి పలు మార్పులు సూచించినట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. కేవలం అందం, ఆకర్షణలకే ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా భద్రత పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కోడెల చెప్పారు.
ఐదు అంతస్థుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందన్నారు. సెల్లార్లో వివిధ సర్వీసులు, ఫస్ట్ ఫ్లోర్లో అసెంబ్లీ, కౌన్సిల్ హాల్ ఉంటాయని...రెండో అంతస్థులో మంత్రుల లాంజ్లు ఉంటాయన్నారు. మూడో ఫ్లోర్లో ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ జరగని సమయంలో పర్యాటకులకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. 250 మీటర్ల ఎత్తులో టవర్ వస్తుందన్నారు. లిఫ్ట్ల ద్వారా టవర్పైకి వెళ్లి నగర అందాలు వీక్షించే అవకాశం పర్యాటకులకు కూడా ఉంటుందన్నారు.