సన్ స్ట్రోకే కాదు..! ఏపి స్పీకర్ కు డాటర్ స్ట్రోక్ ప్రభావం కూడా ఉందట..!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారయ్యింది. ఓ పక్క తరుముకొస్టున్న ఎన్నికలు, మరో పక్క ముంచెత్తుతున్న అవినీతి ఆరోపణలు, ఇంకో పక్క ప్రతిపక్ష పార్టీ ఎదురు దాడి..! ఈ ముడు అంశాల పట్ల నలిగిపోతున్నారు కోడెల. ఇవి చాలవన్నట్టు సన్ స్ట్రోకే కాకుండా డాటర్ స్ట్రోక్ తో కోడెల సతమతమౌతున్నట్టు నియోజకవర్గంలో పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కోడెలకు అదే నియోజకవర్గంలో శ్రుగభంగం తప్పకపోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది.
రాజకీయ నేతగా సుధీర్గ అనుభవం..! వారసులు రూపంలో కోడెలకు కష్టాలు..!!
అవినీతి అంటని రాజకీయ నేతగా ముద్రపడిన కోడెల శివప్రసాద్ ను వారసుల రూపంలో కష్టాలు వెంటాడుతున్నాయి. విపక్ష నేతలు సైతం ప్రశంసించే కోడెలను ఏకంగా అవినీతి సామ్రాట్ అనేంతగా చేరాయి. వైసీపీ నేత అంబటి రాంబాబుపై సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి స్వల్పమెజార్టీతో గెలిచిన కోడెల ఆఖరి నిమిషంలో స్పీకర్ పదవి దక్కించుకున్నారు.
ఓపక్క కుమారుడు, మరో పక్క కుమార్తె..! కోడెలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వారసులు..!!
ఆయన ఎన్నికల్లో పోటీ చేయటాన్ని చాలామంది టీడీపీ నేతలు వ్యతిరేకించారు. అందుకే, ఓడిపోయే సత్తెనపల్లిని అప్పగించి అదిష్ఠానం చేతులు దులుపుకుందనే వాదన లేకపోలేదు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా కీలకశాఖ అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ అంతర్గత వ్యతిరేకత కారణంగా స్పీకర్ పదవి కట్టబెట్టి పెద్దరికాన్ని ఆపాదించారు. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని కోడెల కుమారుడు శివరామకృష్ణ, కూతురు డాక్టర్ విజయలక్ష్మి అవినీతి మాటున కోట్లు సంపాదించారనే ఆరోపణలున్నాయి.
సత్తెన పల్లి నుండి కోడెల డౌట్..! సమాలోచన చేస్తున్న టీడిపి అదిష్టానం..!!
సత్తెనపల్లిలో 200 కోట్ల రూపాయలతో నిర్మించిన షాపింగ్ మాల్ కోడెల వారసులు అక్రమాలకు పాల్పడ్డారని వైసీపి నేత అంబటి రాంబాబు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై తప్పులేదంటే కోటప్పకొండ కోటేశ్వరుని సన్నిధిలో ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. వాస్తవానికి కోడెల శివప్రసాద్ కూడా మొదట్లో వారసుల తప్పిదాన్ని వేలెత్తి చూపుతూ వచ్చారు. కానీ క్రమంగా తాను కూడా భాగమయ్యారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఈ సారి, పార్టీ నుంచి సీటు పొందటం కష్టమనే వాదన ఉంది.
సీటు దొరికితే ఓకే..! లేకపోతే అగమ్యగోచరమే..!!
అయితే కోడెల వారసులు ఇద్దరూ..ఏదో ఒక పార్టీలు సీటు సంపాదించి రాజకీయంగా ఎదగాలని ఉబలాటపడుతున్నారు. దీనికోసం ఐదేళ్లుగా ఆర్ధికంగా బలపడ్డారనే పుకార్లు లేకపోలేదు. ఏమైనా.. మనసున్న వైద్యుడిగా.. పల్నాట పేరు తెచ్చుకున్న కోడెల.. రాజకీయంగా కూడా మచ్చలేని నేతగా మిగిలిపోతారనుకున్నారు. కానీ, ఇలా వారసుల చేతిలో అవినీతి ముద్రతో రాజకీయాల నుంచి వైదొలుగుతారని అనుకోలేదంటూ, టీడీపీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తుండడంతో పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.