'ఓటుకు నోటు కేసు చెల్లదని హైకోర్టు చెప్పింది, చంద్రబాబును ఇరికించే మెటీరియల్ లేదు'
అమరావతి: ఓటుకు నోటు కేసు చెల్లదని హైకోర్టు ఇప్పటికే తేల్చి చెప్పిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఈ కేసులో తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఇరికించాలనే సుప్రీం కోర్టుకు వెళ్లారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును విచారించే మెటీరియలే లేదన్నారు.
రాజకీయ దురుద్దేశ్యంతో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుతో ఏదో జరిగిపోతుందని, జైలుకు వెళ్తారనే వ్యాఖ్యలు అన్నీ అభూతకల్పనలని, దీంతో ఏమీ జరగదని తేల్చి చెప్పారు.
పవన్ కళ్యాణ్కు దమ్ములేదు
బీజేపీపై నోరు ఎత్తడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు దమ్ము లేదని మంత్రి జవహర్ మండిపడ్డారు. ఇద్దరు నేతలు కేంద్రాన్ని ప్రశ్నించడం మానేసి రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు.
వారికి దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు. జగన్ పాప పరిహార యాత్ర 3వేల కిలో మీటర్లు దాటిందని మండిపడ్డారు. అన్న చిరంజీవి హోల్సేల్గా పార్టీ అమ్మితే తమ్ముడు పవన్ కళ్యాణ్ రిటైల్గా అమ్ముడుపోతున్నారన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కసీటు గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని జవహర్ అన్నారు.
పవన్ గాలి వార్తలు పోగు చేసి అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని జవహర్ అంతకుముందు రోజు అన్నారు. పవర్ స్టార్ అంటూ అభిమానులు వెంటపడుతుంటే అతను మాత్రం పవర్ లెస్ స్టార్ అయ్యారన్నారు. ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టానని చెప్పి, కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు.